ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు కౌంటర్: ఎమ్మెల్యేల కొనుగోళ్ళ స్కామ్.. టీఆర్ఎస్ మైండ్గేమ్ మొదలెట్టిందిగా!!
దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదట్లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రధానంగా వినిపించింది. బీజేపీ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని, త్వరలో కవిత విచారణ ఎదుర్కొంటారని ఆరోపణలు కూడా చేశారు. అంతేకాదు కవితకు సన్నిహితంగా ఉన్న పలువురు ఇళ్లపై, కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపి టిఆర్ఎస్ పార్టీ తో మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇక ఇప్పుడు బీజేపీ పై ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో టిఆర్ఎస్ పార్టీకి ఆయుధం దొరికినట్టుగా అయింది. అదును చూసి దెబ్బ కొట్టాలని టీఆర్ఎస్ సిద్ధమైంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం వర్సెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
రాజకీయాలలో ఆరోపణలు చేస్తే ప్రత్యారోపణలు చేస్తారు. విమర్శిస్తే ప్రతివిమర్శలు చేస్తారు. సవాల్ చేస్తే ప్రతి సవాల్ విసురుతారు. ఇక ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఒక కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే, ప్రత్యర్థి పార్టీ సదరు రాజకీయ పార్టీకి సంబంధించిన మరో కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకు రావడం మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం వర్సెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

టీఆర్ఎస్ ను భయపెట్టిన ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవిత ప్రమేయం ఉందని టార్గెట్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో టిఆర్ఎస్ పార్టీని బీజేపీ టార్గెట్ చేయాలని ప్రయత్నించింది. లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఉందని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ హంగామా చేసింది. ఇక లిక్కర్ కుంభకోణంలో కవితకు నోటీసులు పంపిస్తారని, కచ్చితంగా కవిత దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని పదేపదే బీజేపీ నేతలు ప్రకటనలు చేసి మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఏ మేరకు ఉందన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు.

కవిత సన్నిహితులను విచారించిన ఈడీ.. డైలమాలో పడిన టీఆర్ఎస్
కవిత కు సన్నిహితంగా ఉన్న వారిపై ఈడీ దాడులు చేయడం, సిబిఐ విచారణ చేయడం వంటి సంఘటనలు మినహాయించి, అలా ఇప్పటివరకు కవితకు ఎలాంటి నోటీసు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏదో జరగబోతోంది అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఇక ఈ పరిణామాలు టిఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆధారాలు ఉన్నాయని పదేపదే చెప్పడం, కవిత కు సన్నిహితంగా ఉన్న వారిని దర్యాప్తు చేయడం వెరసి టిఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారంలో డైలమాలో పడింది.

టీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్
ఇక ఇదే సమయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టిఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారంలోనూ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కీలక నేతలను టార్గెట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అచ్చం నాటకీయ ఫక్కీలో సాగిన ఈ వ్యవహారంలో నిన్న 2 ఆడియో లీకులను రిలీజ్ చేసి కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. పక్కా ఆధారాలు ఉంటే ఇప్పటికే బయటపెట్టాలి. కానీ టీఆర్ఎస్ ఆ పని చెయ్యటం లేదు.

బీజేపీతో రివర్స్ మైండ్ గేమ్ మొదలెట్టిన టీఆర్ఎస్
ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం జరిగింది అన్న బలమైన ఆధారాలు ఉంటే ఇప్పటికే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, అలా కాకుండా టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బిజెపి మైండ్ గేమ్ మొదలు పెట్టిందో, అదే తరహాలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు గా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రభావం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఉండబోతుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications