చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్.. దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని ఫీట్.. మీడియా ముందుకు కేసీఆర్..
Recommended Video
తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి తన సత్తా చాటింది. ప్రత్యర్థులు అందుకోలేని రీతిలో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు దాదాపుగా 100 పైచిలుకు మున్సిపల్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక 9 కార్పోరేషన్లలో 7 కార్పోరేషన్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా ఫలితాలతో తెలంగాణలో తమకు పోటీయే లేదని టీఆర్ఎస్ మరోసారి నిరూపించింది.

చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్..
పార్లమెంట్ ఎన్నికలను మినహాయిస్తే.. వరుసగా అసెంబ్లీ ఎన్నికలు,స్థానిక సంస్థల ఎన్నికలు,మున్సిపాలిటీ ఎన్నికల్లో 90శాతం ఫలితాలను సాధించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 90శాతం ఛైర్మన్స్ స్థానాలను ఒక పార్టీ గెలుచుకోవడం సంచలనం అంటున్నారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ ఏ జాతీయ పార్టీకి,ప్రాంతీయ పార్టీకి సాధ్యపడలేదని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం దక్కడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 3గంటలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు.ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్న ఆయన ఫలితాలపై నేతలతో మాట్లాడుతున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీ శ్రేణులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు.

ఉత్తర తెలంగాణలో క్లీన్ స్వీప్..
గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలోని కీలక స్థానాలైన కరీంనగర్,నిజామాబాద్,ఆదిలాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో తాజా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెక్ పెట్టబోతున్నామని ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు గట్టిగానే ప్రచారం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ఆ మూడు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. తద్వారా తమకు పోటీయే లేదని టీఆర్ఎస్ నిరూపించింది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మూడు జిల్లాల పరిధిలో ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ దాదాపు 109 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ 5,బీజేపీ ఒకచోట మాత్రమే విజయం సాధించాయి.

మట్టికరిచిన కాంగ్రెస్,బీజేపీ.. :
తాజా ఫలితాల్లో వార్ వన్ సైడ్ అయిందనే చెప్పాలి. చాలాచోట్ల కాంగ్రెస్,బీజేపీ కంటే టీఆర్ఎస్ రెబల్సే గట్టి ప్రభావం చూపించారు. దాదాపు 25-30 మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భావించినప్పటికీ.. అలాంటి పరిస్థితి మాత్రం కనిపించలేదు. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న ఐదు స్థానాలు కూడా.. చివరలో సీన్ ఎలా మారుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక బీజేపీ కేవలం ఆమనగల్ మున్సిపాలిటీలో మాత్రం సత్తా చాటింది. రాష్ట్రంలో మరే మున్సిపాలిటీలోనూ ఆ పార్టీ ప్రభావం కనిపించలేదు.

కాంగ్రెస్ నేతల డీలా :
తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ తీవ్రంగా డీలా పడిపోయింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా అగ్ర నేతల ఇలాఖాల్లోనూ టీఆర్ఎస్ పాగా వేసింది. దీంతో హైదరాబాద్లోని గాంధీ భవన్ ప్రస్తుతం వెలవెలబోతోంది.
తాజా పరిణామాలతో టీపీసీసీ చీఫ్ను వెంటనే మార్చాలన్న డిమాండ్ మరోసారి తెర పైకి వస్తోంది. పార్టీ నాయకత్వాన్ని త్వరగా మార్చి.. క్షేత్రస్థాయిలో పోస్టుమార్టమ్ చర్యలు చేపట్టాలని నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications