సున్నా నుంచి వందకు పాకులాట: తారక మంత్రం ఫలిస్తుందా?
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని సొంతంగా కైవసం చేసుకోవాలనే ఆశతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉంది. సున్నా నుంచి వంద సీట్లకు పాగా వేయడానికి వ్యూహరచన చేసి అమలు చేస్తోంది. గతంలో గ్రేటర్ హైదరాబాదులో తెరాసకు స్థానం కూడా లేదు. రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన అధికారం తెరాసకు కలిసి వస్తుందా అనేది ప్రశ్న.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టిడిపి, కాంగ్రెసు శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు వల వేసి పార్టీలోకి తీసుకుంది. ఇది కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. తెరాసలోకి వలసలు దండిగానే సాగాయి. ఇది ఏ మేరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సిందే. కాగా, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఐటి శాఖ మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు కెటి రామారావు అంతా తానై వ్యవహరిస్తున్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో తారక మంత్రం ఫలిస్తుందా అనేది మరో ప్రశ్న. హైదరాబాద్ పాతబస్తీలో మజ్లీస్ కంచుకోటను బద్దలు కొడుతుందా అనేది కూడా సందేహమే. మజ్లీస్ 40, 50 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంటుంది. వంద సీట్లు ఉన్న గ్రేటర్ హైదరాబాదులో అన్ని సీట్లు మజ్లీస్కు వెళ్తే మిగతా మూడు పార్టీలకు ఏ మేరకు సీట్లు వస్తాయనేది చూడాల్సి ఉంటుంది. టిడిపి - బిజెపి కూటమి తీవ్రంగా దెబ్బ తిన్నదనే అభిప్రాయంతో తెరాస నాయకులు విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెసు కూడా నామమాత్రం ఫలితాలనే సాధిస్తుందని వారు చెబుతున్నారు.

బిజెపి-టిడిపి కూటమిని, కాంగ్రెసును అంత తేలిగ్గా కొట్టేయడానికి వీలవుతుందా అనేది కూడా అనుమానమే. కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో తెరాస ముందున్న మాట మాత్రం వాస్తవం. కెటిఆర్ అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇది కెటిఆర్ సమర్థతకు పరీక్ష కూడా.
ప్రతిపక్షాల నేతలపై విసిరిన 'ఆకర్ష్' వలకు అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర ,నియోజకవర్గ, డివిజన్ స్థాయి నేతలతో పాటు తాజా మాజీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఓ పక్క పార్టీ అభ్యర్థుల ఎంపిక, నాయకుల మధ్య సయోధ్య కుదుర్చుకుంటూనే ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న మంత్రి కెటిఆర్ మరో పక్క కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి, ఎన్నికల్లో పార్టీకి మద్దతు కోరుతూ ముందుకు వెళ్తున్నారు.
ముందస్తు వ్యూహాంతో టీఆర్ఎస్ శిబిరంలోని రెబల్స్ను పోటీ నుంచి తప్పించారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయిన వెంటనే రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ డివిజన్లవారీగా సమన్వయకర్తలతో మాట్లాడుతూనే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలోని అసంతృప్త నేతలతో చర్చలు కొనసాగిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.












Click it and Unblock the Notifications