కారుకు ట్రక్కు టెన్షన్..! పార్లమెంట్ ఎన్నికల్లోపు తేల్చుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నం
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో రెపరెపలాడిన గులాబీ జెండాకు కొన్ని అడ్డంకులున్నాయా? కారుకు పోటీగా కొన్ని గుర్తులు ఇబ్బందికరంగా మారాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఈక్రమంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలుస్తారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో కొన్ని గుర్తులు లేకుండా చేయాలని ఆయనను కోరే ఛాన్సున్నట్లు సమాచారం.

కారుకు పోటీయా..?
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కారుకు కొన్ని గుర్తులు పోటీ పడ్డాయి. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. అయితే ఈ అంశాన్ని గులాబీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని గుర్తులు టీఆర్ఎస్ ఓట్లకు గండికొడుతున్నాయనే కారణంతో దిద్దుబాటు చర్చలకు ఉపక్రమిస్తున్నారని వినికిడి. అందులోభాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. పనిలోపనిగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసే యోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కారుకు సమీపంగా ఉండి తికమక పెడుతున్న కొన్ని గుర్తులను రద్దు చేయాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కోరనున్నట్లు తెలుస్తోంది.

గుర్తులతో బేజార్..! కారు పరేషాన్
ట్రక్కు, ఆటో, రోడ్ రోలర్, టోపి, కెమెరా లాంటి గుర్తులు టీఆర్ఎస్ ఓటుబ్యాంకును దెబ్బతీస్తున్నాయనేది ఆ పార్టీ నేతల మాట. ఈ గుర్తులతో పలుచోట్ల టీఆర్ఎస్ ఓట్లకు గండిపడిందనే వాదన లెవనెత్తుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇలాంటి గుర్తులు కొంతమేర ఓటర్లను కన్ఫ్యూజ్ చేశాయంటున్నారు గులాబీ నేతలు.
అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించినప్పటికీ.. భవిష్యత్తు ఎన్నికల్లో ఈ గుర్తులతో కారుకు డేంజర్ ఉన్నట్లేనని భావిస్తున్నారు. అందుకే కారును పోలిన గుర్తులు గానీ, సమీపంగా కనిపించే గుర్తులు గానీ లేకుండా చేయాలనేది గులాబీ బాస్ అంతరంగంగా కనిపిస్తోంది.

కారు ఓట్లకు గండి.. అందుకే ఇలా..!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు, ఆటో లాంటి గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించకుండా టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే అనివార్య కారణాలతో టీఆర్ఎస్ వ్యూహం ఫలించలేదు. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన కొందరికి ట్రక్కు, ఆటో, రోడ్ రోలర్ లాంటి గుర్తులు కేటాయించింది ఈసీ. దీంతో కొన్ని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల మెజార్టీ తగ్గిందంటున్నారు ఆ పార్టీ నేతలు. కారును పోలిన గుర్తులతో గులాబీదండుకు నష్టం జరిగే అవకాశాలు ఉండటంతో కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి భవిష్యత్ ఎన్నికల నాటికైనా ఇలాంటి గుర్తులు లేకుండా చేయాలని చర్చించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications