ఈనెల 14న బీజేపీలోకి ఈటల రాజేందర్ -ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో చేరుతారన్న బండి -అమిత్ షా దర్శనం దొరికేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహానికి గురై, మంత్రి పదవి నుంచి బహిష్కృతుడైన ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతగా సారధి కేసీఆర్ తో 20 ఏళ్ల స్నేహం.. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కీలక పదువు.. రాష్ట్రంలో పేరెన్నిక గల పౌల్ట్రీ వ్యాపార కుటుంబానికి చెంది ఉండి కూడా టీఆర్ఎస్ నుంచి రాజేందర్ వెలి.. భారీ కుదుపులు, పెద్ద ఎత్తున చీలికలు లేకుండా అతి సాధారణంగా పూర్తయింది. వచ్చేవారం బీజేపీలో చేరడం ద్వారా ఈటల వర్సెస్ కేసీఆర్ ఎపిసోడ్ ముగియనుంది.

14న చేరిక, షాను కలుస్తారా?
ఇప్పటికే ఓసారి ఢిల్లీకి వెళ్లి బీజేపీ హైకమాండ్ పెద్దలను కలిసొచ్చిన ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీకి, హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ 14న ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోసారి ఢిల్లీ వెళ్లి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ కండువా కప్పుకోనున్నారు. కేసీఆర్ సర్కారు రాజేందర్ కుటుంబంపై పెట్టిన కేసుల నేపథ్యంలో ఆయనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దర్శనభాగ్యం దక్కుతుందా, లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

బండి సంజయ్ క్లారిటీ
ఈటల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ కూడా ఢిల్లీకి వెళ్లి కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 13న ఈటల ఢిల్లీ వెళ్లి నడ్డా సమక్షంలో బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై బండి సంజయ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడింది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక
బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈటల రాజేందర్, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ 14న బీజేపీలోకి వస్తారని బండిసంజయ్ తెలిపారు. ఈటల రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదిస్తే, ఆరునెల్లోపే తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయంగా మారింది. ఈటల బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనుండగా, కొత్త అభ్యర్థి కోసం టీఆర్ఎస్ పలు పేర్లను పరిశీలిస్తున్నది.












Click it and Unblock the Notifications