కెసిఆర్ సర్వే: విపక్షాలది కాదు, ఉలుకు అధికార పక్షానిదే

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు 111 అసెంబ్లీ స్థానాలు తమవేనని టీఆర్ఎస్ నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చడంతో విపక్షాలు భుజాలు తడుముకుంటున్నాయని అధికార పక్షం విమర్శిస్తున్నది. తదనుగుణంగా అధికార మీడి

హైదరాబాద్: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు 111 అసెంబ్లీ స్థానాలు తమవేనని టీఆర్ఎస్ నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చడంతో విపక్షాలు భుజాలు తడుముకుంటున్నాయని అధికార పక్షం విమర్శిస్తున్నది. తదనుగుణంగా అధికార మీడియాలో వార్తకథనాలు వండి వార్చింది.

సర్వే ఫలితాలపై విపక్షాలు బట్టలు చింపుకొంటున్నాయి. అందుకు కొందరు రాజకీయవాదులు, విశ్లేషకులు వంత పాడుతున్నారని 'నమస్తే తెలంగాణ' పత్రికలో రాజకీయ వ్యాఖ్యానం ప్రచురితమైంది. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతవుతున్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తాయని ఢంకా బజాయించుకున్న టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సర్వే బోగస్ అంటూ భుజాలు తడుముకుంటారని ఎద్దేవా చేసింది.

వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గల్లంతైన షబ్బీర్ అలీ తనకు కొత్తగా పోయేదేమీ లేదుగనుక ఎన్నికలకు సిద్ధమని సవాలు విసురుతున్నారని, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎక్కడ అంజనం వేసి చూసుకున్నారో గానీ.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవడానికి ఈ సర్వే చేయించారని వ్యాఖ్యానించి సరిపెట్టారని 'నమస్తే తెలంగాణ' కథనం సారాంశం.

సర్వేపై అధికార మీడియా ఇలా

సర్వేపై అధికార మీడియా ఇలా

ఆ మాటకు వస్తే అసలు ఉలుకంతా అధికార పక్షానిదే తప్ప విపక్షాలదేమాత్రం కాదని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా తక్షణం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 119 అసెంబ్లీ స్థానాలకు 111 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందే పరిస్థితి ఉంటే.. విపక్షాల విమర్శలకు జడుసుకోవాల్సిన పనే లేదు. ‘కానీ ఉన్నమాటంటే ఉలుకెక్కువని.. ప్రతిపక్షాల రాద్ధాంతంలో అర్థమే లేదు. టీఆర్‌ఎస్ మీద ప్రజల ఆదరణ ఈనాటిది కాదు. 14 ఏండ్లపాటు ప్రజలకున్న అచంచల విశ్వాసం తిరుగులేనిది. ఆ విశ్వాసమే తెలంగాణ ఇచ్చింది మేమే. తెచ్చింది మేమే అని ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా జనహృదయ అధినేతను రాష్ట్ర సారథిని చేసింది. తమ కలలు సాకారం చేయగల నాయకుడొకరే అని బల్లగుద్ది చెప్పింది. ప్రజల ఆకాంక్షలే మ్యానిఫెస్టోగా స్వీకరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కన్న కలలు ఒకటొకటిగా నెరవేర్చుతూ వస్తున్నది' అని నమస్తే తెలంగాణ రాసింది.

2009లో మరీ తగ్గిన టీఆర్ఎస్ ప్రాభవం

2009లో మరీ తగ్గిన టీఆర్ఎస్ ప్రాభవం

16 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీని ప్రజలు కడుపున బెట్టి చూసుకున్నట్లు కూడా ఆ దినపత్రిక కథనం సారాంశం. ఆ మాటకు వస్తే 2002లో జరిగిన సిద్ధిపేట అసెంబ్లీ స్థాన ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో 25 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలు గెలుచుకున్నది. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ సాచివేత ధోరణిని నిరసిస్తూ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండు లోక్ సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. మిగతా స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించాయి. 2009 ఎన్నికల్లో 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. నమస్తే తెలంగాణ వార్తాకథనమే నిజమైతే 2004 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభ ఎందుకు కొడిగట్టుకుపోయిందో తెలియచేసుకోవాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఇలా ఓటమి

2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఇలా ఓటమి

2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల్లో విజయాలు సాధించడం అనూహ్య పరిణామమే కాదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80కి పైగా డివిజన్లలో విజయం సాధిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని వార్తలొచ్చాయని, కానీ 99 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించిందని నమస్తే తెలంగాణ గుర్తుచేసింది. తర్వాత జరిగే వివిధ ఎన్నికల్లో విజయం సాధించడం ఒక వాపైనా బలుపుగా అధికార పక్షం భావిస్తున్నదని గుర్తించ నిరాకరిస్తున్నారు. అనూహ్య ఫలితాలతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఓటమి పాలై విపకాలకు తర్వాత అదే ప్రజాదరణ లభించిన ఘటనలు కోకొల్లలు. 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైన సంగతి తెలియని విషయం కాదు. ఈ సంగతి అధికార టీఆర్ఎస్‌కు, దాని సారథ్యంలో ‘నమస్తే తెలంగాణ' తెలియని సంగతి కాదు.

2013లో ఆప్ విజయం ఇలా స్ఫూర్తి

2013లో ఆప్ విజయం ఇలా స్ఫూర్తి

1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సమర్థించుకున్న‘నమస్తే తెలంగాణ' 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయమై, ఆప్ ఘన విజయం సాధించడం అధికార టీఆర్ఎస్ పార్టీకే వర్తిస్తుందన్న సంగతి విస్మరిస్తున్నది. వచ్చే ఏడాది ప్రారంభించే ‘రైతుకు రూ.8000 ఆర్థిక సాయం' పథకంపై ఇప్పటికే ప్రజాదరణ సాదించిందని మరో అంశం నమస్తే తెలంగాణ ముందుకు తెచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన రుణ మాఫీ పథకం అమలుకు నోచుకున్నదా? లేదా? అన్న సంగతి 2019 ఎన్నికల తర్వాత తేలనున్నది.

రైతులకు ఖమ్మంలో భేడీలు సర్కార్ ఫలమేనా?

రైతులకు ఖమ్మంలో భేడీలు సర్కార్ ఫలమేనా?

రైతులకు ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్న అధికార టీఆర్ఎస్, దాని మిత్ర పక్షం ‘నమస్తే తెలంగాణ' మరో విషయం విస్మరిస్తున్నది. ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై రాజకీయాలు చేసింది. విపక్షాల కుట్ర అని విమర్శలకు దిగింది. అమాయక రైతులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయడమే కాదు.. వారి చేతులకు బేడీలు వేసి కోర్టు మెట్లెక్కించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్న సంగతి అందరికీ తెలుసుని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

లోక్ సభలో గెలుపొందలేని ఎమ్మెల్సీ పల్లా ఇలా

లోక్ సభలో గెలుపొందలేని ఎమ్మెల్సీ పల్లా ఇలా

సర్వే ఫలితాలతో విపక్షాలు ఆగమాగమవుతున్నాయని సాక్షాత్ రాష్ట్ర మంత్రి తన్నీర్ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసమే అవాకులు, చవాకులు పేల్తున్నాయన్నారు. కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి 2014 లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి పాలైన సంగతి విస్మరిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం తన ఘనతగా పల్లా రాజేశ్వర్ రెడ్డి భావిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ వరకూ ప్రతి ఒక్కరూ వాస్తవాలు విస్మరించి విమర్శలకు దిగితే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+