టీఆర్ఎస్కు షాక్: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, చేరికలు ఆగవన్న బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్
టీఆర్ఎస్ పార్టీ నేత, ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో భిక్షమయ్యగౌడ్ కషాయం కండువా కప్పుకున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు.
బీజేపీలోకి చాలా మంది నేతలు వస్తారంటూ బండి సంజయ్
ఇంకా చాలామంది ఇతర పార్టీల నేతలు బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు బండి సంజయ్. బీజేపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన భిక్షమయ్య గౌడ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పనిచేశారు.. గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు.. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు.
అయితే, 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆలేరులో టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న ఆయన.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్లో సరైన గుర్తింపు లేకపోవడం.. నామినేటెడ్ పోస్టులు ఆశించినా.. నిరాశే ఎదురుకావడంతో.. ఆయన కమలం గూటికి చేరారు.
ప్రజలకు దూరం చేసే కుట్ర అంటూ టీఆర్ఎస్పై బిక్షమయ్య గౌడ్ ఫైర్
కాగా, భిక్షమయ్య గౌడే సోమవారం ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో తనకు టీఆర్ఎస్లో జరిగిన అవమానాలు, తత్ఫలితంగా తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల గురించి ఆయన ఏకరువు పెట్టారు. ఆలేరు అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు 2018లో టీఆర్ఎస్లో చేరా. అభివృద్ధిలో నన్ను భాగస్వామిని చేస్తారని భావించా.
ఇక్కడి ప్రజల నుంచి నన్ను వేరు చేసేందుకు కుట్ర చేశారు. ఇక్కడ తిరగొద్దని, ప్రజలను కలవొద్దని టీఆర్ఎస్ పెద్దలు ఆదేశించారు. మూడేళ్లుగా ప్రజలను కలవకుండా కట్టడి చేశారు. ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్రను నేనే ఛేదించాను. ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నా అని బిక్షమయ్య గౌడ్ పేర్కొన్నారు.