జూపల్లి కృష్ణారావు జాతీయపార్టీ వైపు చూస్తున్నారా? వరుస భేటీల మర్మమేంటి? 9 నెలల్లో ఏం జరుగుతుంది?
హైదరాబాద్: గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 సంవత్సరాల నుంచి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధం ఉందని చెప్పారు.
భవిష్యత్పై త్వరలో నిర్ణయం: జూపల్లి కృష్ణారావు
తెలంగాణ ఏర్పాటు కోసం నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరినట్టు గుర్తు చేశారు జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. భవిష్యత్పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు తనకు భవిష్యత్తు ముఖ్యం కాదన్న ఆయన.. తనను నమ్ముకున్న కొల్లాపూర్ ప్రజల భవిష్యత్ ముఖ్యం అని జూపల్లి స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, రానున్న రోజుల్లో మనకు మంచి జరుగుతుందని జూపల్లి అన్నారు. జూపల్లి అంటే సేవాభావంతో కూడిన రాజకీయం చేస్తాడని చెప్పారు. కొంతమంది బెదిరింపు రాజకీయం చేస్తున్నారని, ఎవరూ భయపడొద్దని కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. కాగా, జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీకి, జూపల్లికి మధ్య పెరిగిన దూరం
ఇటీవలే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలతో జూపల్లి చర్చించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన జూపల్లి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు... కాంగ్రెస్ అభ్యర్ధి హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఈ ఇద్దరి వర్గాల మధ్య పోరు సాగుతోంది. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు తన అభ్యర్ధులను గెలిపించుకున్నారు. ఈ పరిణామాలపై టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే పార్టీకి, జూపల్లికి మధ్య మరింత దూరం పెరిగినట్లు తెలుస్తోంది
బీజేపీవైపు చూపల్లి చూపు??.. వచ్చే 9 నెలలే కీలకం
అంతేగాక, ఇటీవలే ఖమ్మంలో టీఆర్ఎస్లో అసమ్మతి వర్గంగా ఉన్న నేతలతో జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలోని తన అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు త్వరలోనే ఆ పార్టీ వీడి ఓ జాతీయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. జూపల్లి కృష్ణారావు బీజేపీ వైపు చూస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని తన అనుచరులకు జూపల్లి కృష్ణారావు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. కాగా, తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల కోసమేనని... తన పదవి కోసం ఏనాడు పని చేయలేదని జూపల్లి వెల్లడించారు. వచ్చే 9 నెలల్లో ఏం జరుగుతుందో చూద్దామని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంకు చెందిన ఓ టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కూడా తనతో కాంగ్రెస్, బీజేపీలు టచ్లో ఉన్నాయని చెప్పడం గమనార్హం.