రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక నిర్ణయాలు..!!
కీలక రాజకీయ పరిణామాలకు..నిర్ణయాల ప్రకటనకు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. సోమ - మంగళవారాల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండు రోజులలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాజాగా స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యల విషయంలో సభాపతి ఏ విధంగా స్పందిస్తారనేది ఉత్కంఠతకు కారణమవుతోంది. ఇప్పటికే మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పీకర్ పైన వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పాలని..లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి ఈటల తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసారు.

అసెంబ్లీ వేదికగా కేంద్రం పై
ఇక, ఇదే సమయంలో కేంద్రం పైన రాజకీయ యుద్దం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పైన సభలోనే చర్చించి..కేంద్ర తీరును ఎండగడుతూనే తెలంగాణ నమూనా దేశానికి అవసరమన్న వాదనను వినిపించాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో జాతీయ పార్టీ ప్రకటనకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా రానున్న రెండు రోజుల సమావేశాలను సద్వినియోగం చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా సమావేశాలు జరిగనునన్నట్లు తెలుస్తోంది. కేంద్రం - రాష్ట్రం అంశాలపైనే రెండ్రోజుల పాటు చర్చసాగే అవకాశం ఉంది.

జాతీయ రాజకీయాల్లో కీలక అడుగు
జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ అడుగుల నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందుకు అనుగుణంగా సభలో వాణి వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రోజులు ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా స్వల్పకాలిక చర్చను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ అభివృద్ధికి చేయూతనిస్తూ అండగా నిలవాల్సిన కేంద్రం.. పదేపదే అడ్డంకులు సృష్టిస్తోందన్న రాష్ట్రప్రభుత్వం అదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా మరోమారు బలంగా చాటాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు సభలో చర్చకు ప్రతిపాదించిన అంశాల్లోనూ రాష్ట్రం, కేంద్రప్రభుత్వ వైఖరి, సంబంధాల అంశాలున్నాయి. వాటన్నింటి నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రం విషయంలో కేంద్రానికి సంబంధించిన అంశాలపై స్వల్పకాలిక చర్చ ఉంటుందని తెలుస్తోంది.

ఈటల పై చర్యలు ఉంటాయా
ఎఫ్ఆర్బీఎమ్ పరిధికి లోబడి రాష్ట్రప్రభుత్వం తీసుకునే రుణాల విషయంలో కేంద్రం ఆంక్షలు విధించింది. గతంలో తీసుకున్న బడ్జెటేతర అప్పులపై అభ్యంతరం వ్యక్తంచేసి ఎఫ్ఆర్బీఎమ్ రుణాల మొత్తంలో కోత విధింపు పైనా ప్రధానంగా చర్చకు అవకాశం ఉంది. ఇక, విద్యుత్ బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్కు రూ.6,756 కోట్లు చెల్లించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటంతో..దీని పైన సభలో తీర్మానం చేస్తారని చెబుతున్నారు. అన్ని అంశాలపై సభలో చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికార పార్టీ భావిస్తోంది. దీంతో..రెండు రోజుల సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కేంద్రం పైన రాజకీయంగా తీసుకొనే నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications