టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: భార్య, కుమారుడికి కూడా: హోమ్ క్వారంటైన్లోకి కుటుంబం
మేడ్చల్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహోధృతంగా విస్తరిస్తోంది. సామాన్యులనే కాదు.. ప్రజా ప్రతినిధులకూ సోకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. వైరస్ బారిన పడ్డారు. ఆ మరుసటి రోజే టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
Recommended Video
షాకింగ్: టీటీడీలో తొలి కరోనా మరణం: శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు కన్నుమూత:
ఆయన కుటుంబానికీ కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం వారంతా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆయన రెండురోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. అనంతరం ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్కు పరీక్షలను నిర్వహించారు. వారికి కూడా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
ప్రస్తుతం వారందరినీ హోమ్ క్వారంటైన్కు వెళ్లాలని సూచించినట్లు మేడ్చల్ జిల్లా వైద్యాధికారి ఆనంద్ తెలిపారు. 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే, ఆయన కుటుంబానికి సూచించినట్లు చెప్పారు. ఇదివరకు తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా కరోనా బారిన పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఏపీలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కరోనా బారిన పడ్డారు. బియ్యపు మధుసూధన్ రెడ్డి భార్యకు కూడా వైరస్ సోకింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.