కేసీఆర్కు షాకిస్తారా?: వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్తో ఎమ్మెల్యే రాజయ్య భేటీ, ఏం చర్చించారు?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వరుసగా నిరుద్యోగ దీక్షలు చేస్తూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు షర్మిల.
అనిల్ కుమార్తో రాజయ్య భేటీ..
ఈ నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటికొండ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల భర్త అనిల్ కుమార్ను కలిశారు. లోటస్పాండ్కు వెళ్లి భేటీ అయ్యారు రాజయ్య. గతంలో పలుమార్లు షర్మిలతోనూ సమావేశమైన రాజయ్య.. తాజాగా అనిల్ కుమార్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజయ్య.. షర్మిల పార్టీలో చేరతారా?
త్వరలోనే రాజయ్య వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టడంతో దళిత సంఘాల నుంచి, దళిత సంఘాల ప్రజాప్రతినిధుల నుంచి ప్రశంసలు వస్తున్న తరుణంలో రాజయ్య లోటస్పాండ్కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అనిల్ కుమార్తో రాజయ్య ఏం చర్చించారు?
అయితే, రాజయ్య-అనిల్ కుమార్ భేటీ వ్యక్తిగతమైనదేనని.. రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశం కాదని బ్రదర్ అనిల్ కుమార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత సమావేశంలో మొదలయ్యే ఇలాంటి భేటీలు భవిష్యత్తులో రాజకీయ సమావేశాలుగా మారతాయని, వైయస్సార్టీపీలో చేరే అవకాశం కూడా లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో పలుమార్లు షర్మిలతోనూ భేటీ అయిన రాజయ్య ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ను మాత్రమే కలిసినట్లు తెలుస్తోంది.
కడియంకు పెరిగిన ప్రాధాన్యతే కారణమా?
కాగా, స్టేషన్ఘన్పూర్ నియోజకర్గంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజయ్య మధ్య సత్ససంబంధాలు లేకపోయినప్పటికీ.. ఒకే పార్టీలో ఉంటూ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారని బహిరంగ రహస్యమనే చెప్పాలి. ఇరువురు నేతలు కూడా పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ఉన్నారు. అయితే, ఇటీవల కాలంలో కడియం శ్రీహరికి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలు పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో రాజయ్య కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల, అనిల్ కుమార్లతో భేటీలకు ప్రాధాన్యత నెలకొంది. త్వరలోనే రాజయ్య పార్టీ మార్పుపై సంచలన నిర్ణయం తీసుకుంటారా? లేక కొంత సమయం తీసుకుని అవకాశం కోసం ఎదురుచూస్తారా? అనేది తేలాల్సి ఉంది.
Recommended Video
తెలంగాణలో వైయస్సార్టీపీ.. రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీల నేతలు వైయస్సార్టీపీలో చేరిన విషయం తెలిసిందే, మరికొందరు నేతలు ఆ పార్టీని వీడారు కూడా. నిరుద్యోగ దీక్షల పేరుతో షర్మిల తరచూ రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న యువత కుటుంబాలను కలిసి పరామర్శిస్తున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే, వైయస్సార్టీపీలోకి పలువురు నేతలు చేరుతుండగా, మరికొందరు నేతలు బయటికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో వైయస్సార్టీపీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. ఇది ఇలావుంటే, తాజాగా, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారు. దీంతో మరో రాజకీయ పార్టీ క్రియాశీలకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్కు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల నుంచే గాక, షర్మిల పార్టీ, బీఎస్పీ నుంచి కూడా గట్టి పోటీని ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది.