ఎమ్మెల్సీ ఎన్నికల వేళ... టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు...
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేద్దామని టీఆర్ఎస్ శ్రేణులతో పేర్కొన్నారు. ఓటర్లను ఏ,బీ,సీ,డీగా విభజించి... అందులో టీఆర్ఎస్కు ఓటు వేసేవారు,వేయనివారిని గుర్తించాలన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేసే ఉద్దేశం లేని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేద్దామన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానిక టీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన... 'ఓటర్ల లిస్టు దగ్గరపెట్టుకోండి... కింద నుంచి పైకి,పైనుంచి కిందకి స్టడీ చేయండి.ఓటర్లను ఏ,బీ,సీ,డీలుగా లెక్క పెట్టండి. ఏ అంటే మనోడు,బీ,సీ అలా... చెప్పకూడదు,ఆఫ్ ది రికార్డ్... డబ్బులు కూడా ఇస్తాం... ఎస్.. భయమేమీ లేదు... ఖర్చులకు ఇస్తాం..' అంటూ రాములు నాయక్ వ్యాఖ్యానించారు. ఓటర్లను ప్రలోభాల పెట్టేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అధికార టీఆర్ఎస్ తమ సిట్టింగ్ ఎమ్మెల్సీ(వరంగల్-ఖమ్మం-నల్గొండ) స్థానాన్ని నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో మరిపించాలనుకుంటోంది. అందుకే పలువురు మంత్రులకు సైతం బాధ్యతలు అప్పగించి ప్రచారం పర్వంలోకి దింపింది. గెలుపు బాధ్యతలు వారిపైనే పెట్టింది. అంతేకాదు,ఒకవేళ ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కేసీఆర్ నుంచి హెచ్చరికలు కూడా వెళ్లాయి. దీంతో గ్రౌండ్లో టీఆర్ఎస్ నేతలు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు.
టీఆర్ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, కాంగ్రెస్ తరుపున రాములు నాయక్,తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం,తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్,యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ,స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న తదితరులు వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణి,బీజేపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు,కాంగ్రెస్ తరుపున చిన్నారెడ్డి,స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నో ఎన్నికలు,ఉపఎన్నికలు గెలిచిన టీఆర్ఎస్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని మాత్రం ఇంతవరకూ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె,విద్యావేత్త సురభి వాణిని సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అక్కడినుంచి బరిలో దింపారు.
కాగా,తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానాలకు ఆదివారం(మార్చి 14) ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,రామచంద్రరావుల పదవీ కాలం మార్చి 29తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 17న వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications