మా పార్టీలోనే దొంగలు .. టీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యేల షాకింగ్ కామెంట్స్
టిఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షాల అవసరం లేకుండా పోయింది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీ లోనే దొంగలు ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు టిఆర్ఎస్ పార్టీలో ప్రజలను దోపిడీ చేస్తున్న నాయకులను చెప్పులతో కొట్టమంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. మొన్నటికి మొన్న అటవీ చట్టాల అమలులో నిరంకుశంగా వ్యవహరించమని, అటవీ చట్టాలకు విఘాతం కలిగించే టిఆర్ఎస్ నాయకులు ఎవరున్నా ముందు వారిపై చర్యలు తీసుకోమని గులాబీ బాస్ చెప్పడంతో ఇప్పుడు ఎవరికి వారు పార్టీ లో దొంగలు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ముక్కుమీద వేలేసుకునేలా చేస్తున్నారు.
మొన్న మల్లారెడ్డి ... నేడు కొప్పుల ఈశ్వర్ షాకింగ్ కామెంట్స్
మొన్నటికి మొన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో దొంగలు ఉన్నారంటూ, భూములు కబ్జా చేసేది తమ పార్టీ నాయకులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ గ్రాబర్స్ అంతా తమ లీడర్లే అంటూ మల్లా రెడ్డి చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీలో దుమారం రేపాయి. పార్టీ నాయకులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మల్లారెడ్డి కి ఇదేం కొత్తకాదు. ఇక తాజాగా టీఆర్ఎస్ నాయకుడు ధర్మపురి శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ పార్టీ వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు ప్రజలను దోచుకుతినే పనిలో బిజీగా ఉన్నారు అన్న కొప్పుల ఈశ్వర్ పార్టీ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు దొంగలు తయారయ్యారని, ప్రజల నుంచి పైసలు వసూలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బులు అడిగే పార్టీ నాయకులను ప్రజలు చెప్పుతో కొట్టాలని షాకింగ్ కామెంట్ చేశారు .జగిత్యాల జిల్లా ధర్మపురి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
టీఆర్ఎస్ లో ఉన్న దొంగలను చెప్పుతో కొట్టమన్న ఈశ్వర్
టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు వున్న కొప్పుల ఈశ్వర్ తనను సొంత పార్టీ నేతలే ఓడించాలని కంకణం కుట్టుకుని పనిచేశారని చెప్పి వారికి తగిన బుద్ధి చెబుతాం అంటూ చేసిన వ్యాఖ్యలతో ధర్మపురి నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అంతేకాదు ధర్మపురి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీలో దొంగలు ఉన్నారని, సీఎం రిలీఫ్ ఫండ్ లక్ష రూపాయలు మనం ఇప్పిస్తే ఆ మనిషి వెంట వచ్చి రూ.5 వేలు, రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.వాళ్లను కారు ఎక్కించుకుని తీసుక వచ్చి సాయంత్రానికి దావతు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వాళ్లేమో ఎమ్మెల్యే ఇప్పించాడని అనుకోవడం లేదని అన్నారు. వెంట వచ్చిన ఆయన చెప్పడం వల్లనే పైసలు వచ్చాయని అనుకుంటున్నారని అన్నారు. రూ.లక్ష ఇప్పిస్తే 10 వేలు, 20 వేలు.. ట్రాక్టర్లు ఇప్పిస్తే ట్రాక్టర్కు రూ.50 వేలు, లక్ష వసూలు చేశారని ఆరోపించారు. కల్యాణలక్ష్మికీ పైసలు వసూలు చేశారని, ఈ దొంగలను నమ్మొద్దని మనవి చేస్తున్నానని అన్నారు. కళ్యాణలక్ష్మికి, సీఎం రిలీఫ్ ఫండ్కు ఎవడైనా పైసలు అడిగితే చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. వాడు మా నాయకుడైనా, మరెవరైనా సరే అని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సొంత పార్టీ నేతల పై కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తున్నాయి.
సొంత పార్టీ నేతలపై అధినేత సంచలనం ... ఆయన బాటలోనే అనుచరగణం
టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తాజాగా అటవీ పరిరక్షణ కోసం చట్టాలను కట్టుదిట్టం చేయాలని భావించిన నేపథ్యంలో, అటవీ సంపదను దోచుకునే, పరిరక్షణకు విఘాతం కలిగించే ఎంతటివారిపైనైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటే ముందు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాదు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సైతం అవినీతికి పాల్పడితే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన కెసిఆర్ సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో సంచలనం కలిగించాయి. ఇక కెసిఆర్ బాటలోనే నడుస్తున్న ఎమ్మెల్యేలు సైతం బాహాటంగా ఈ తరహా వ్యాఖ్యలకు దిగడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తుంది.
ప్రతిపక్షాలు అవసరం లేదు ... స్వపక్షమే చాలు
తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చావు దెబ్బ తిని కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసే స్థాయిలో ప్రస్తుతం లేవు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీల పాత్రను టిఆర్ఎస్ పార్టీ నాయకులు తామే పోషిస్తున్నట్లు గా ప్రస్తుత వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి అని కొందరు నేతలు వాపోతున్న పరిస్థితి. ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు అనేది తాజా వ్యాఖ్యలతో తేటతెల్లమవుతోంది. పార్టీలో కలకలం సృష్టిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల సంచలన వ్యాఖ్యలు పార్టీ నాయకుల తీరుకు అద్దం పడుతున్నాయి.