ఆంధ్ర బస్సులకు హెచ్చరిక: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెరాస ఎమ్మెల్యే
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది మరణించిన నేపథ్యంలో తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ ఆంధ్ర బస్సులపై కత్తులు నూరుతున్నారు.
హైదరాబాద్: ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్, సింగిల్ పర్మిట్లను అనుమతించకుంటే 15 రోజుల్లో ఆంధ్ర సరిహద్దుల్లో గల కోదాడ వద్ద ఆంధ్రా బస్సులు, లారీలను ఆర్టీసీ కార్మికులతో కలిసి అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు ఎపి ప్రభుత్వాన్ని శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అక్రమంగా బస్సులు, లారీలను తిప్పినట్లుగా ఇప్పుడు కూడా ఆంధ్రా బస్సులు తిరుగతున్నాయని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో ఆర్టీసీకి రూ.1000 నుంచి రూ.1200 కోట్ల నష్టం వస్తున్నదని ఆయన చెప్పారు.
సింగిల్ పర్మిట్లు అంగీకరించకపోవడం వల్ల తెలంగాణలోని 1.40 లక్షల లారీ యజమానులకు నష్టం కలుగుతుందన్నారు. కృష్ణా జిల్లాలోని నందిగామ వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 10 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో టీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్రెడ్డి, టీఎంఎస్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.