ఎమ్మెల్యేల ఎర కేసు: రామచంద్రభారతి, నందకుమార్లకు బెయిల్
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మిగిలిన ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఏ1 రామచంద్ర భారతి, ఏ2 నందకుమార్కు బెయిల్ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. పూచీకత్తు సమర్పించడంతో బెయిల్ మంజూరు చేయగా.. గురువారం చంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.
కాగా, ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న సింహయాజీ స్వామికి కూడా ఇటీవల బెయిల్ మంజూరైంది. సింహయాజీ తరపు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో 6 లక్షల పూచీకత్తుతోపాటు ఇద్దరు జామీను సమర్పించారు. దీంతో కోర్టు బెయిల్ పత్రాలు మంజూరు చేసింది.
స్వామిజీ తరపు న్యాయవాది ఈ పత్రాలను చంచల్గూడ జైలులో సమర్పించగా.. బుధవారం జైలు అధికారులు వాటిని పరిశీలించి, ఆయనను విడుదల చేశారు.
సింహయాజీకి గతంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. పూచీకత్తు, జామీను సమర్పించడంలో ఆలస్యం కావడంతో విడుదల కాలేకపోయారు. దీంతో ఆరు రోజుల తర్వాత ఇద్దరి జామీను, 6 లక్షల పూచీకత్తుతో విడుదయ్యారు. తాజాగా, ఇదే కేసులో ప్రధాన నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్ లకు ఏసీబీ బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుస్వామి, తుషార్ వెల్లాపల్లి, బూసారపు శ్రీనివాస్ లను నిందితులు చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మొదటి ముగ్గురు నిందితుల నేరాంగీకర వాంగ్మూలంలో ఎక్కడా ఈ నలుగురి పేర్లు లేవని, ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ తదితరాల్లోనూ ఈ నలుగురి పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఏసీబీ చట్టం కింద కేసుల్ని శాంతిభద్రతల పోలీసులుగానీ, సిట్ గానీ దర్యాప్తు చేయకూడదనే అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటోంది. అయితే, ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.