'ఇకపై సీఎం కెసిఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన, ప్రభుత్వం పైన ఇష్టారీతిన మాట్లాడితే ఇక నుంచి కేసులు తప్పవని, ఎవరు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం నాడు హెచ్చరించారు. ఆధారాలు చూపిస్తే తాము చర్చకు సిద్ధమని చెప్పారు.
బిజెపి నేతనాగం జనార్ధన్ రెడ్డికి కోర్టు చీవాట్లు పెట్టిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

కాంగ్రెస్ నేతలు చెబుతున్నవన్నీ అబద్దాలన్నారు. అసలు ప్రాజెక్టులపై ఇంత వరకు ఒప్పందాలే జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడొద్దన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ఇకపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కార్యకర్తల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కార్యకర్తలందరికీ ప్రీమియం అందిస్తోన్న పార్టీ తెరాసనే అన్నారు. ఇటీవల చనిపోయిన కార్యకర్తలకు రూ.2 లక్షల చొప్పున 274 మందికి ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందజేసినట్లు చెప్పారు. ఇవాళ మరికొంత మందికి అందజేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications