వరంగల్ సభ ఖర్చుల కోసం ‘గులాబీ కూలీ’లుగా మారిన కేకే, తలసాని!
వరంగల్ టీఆర్ఎస్ సభ ఖర్చుల కోసం మంగళవారం ఏంపీ కేశవరావు, మంత్రి తలసాని చెమటోడ్చారు. ఇద్దరూ కలిసి ‘గులాబీ కూలీ’ కార్యక్రమం ద్వారా రూ.8 లక్షలు సంపాదించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులకు 'గులాబీ కూలీ' ద్వారా బాగానే గిట్టుబాటు అవుతోంది. మంగళవారం పార్టీ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావు(కేకే) 'గులాబీ కూలీ'గా మారారు. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థులకు పాఠాలు బోధించి ఆయన రూ.2 లక్షలు సంపాదించారు.
అలాగే నోవా ఇంజనీరింగ్ కళాశాలలో బోధనా మెలకువలు చెప్పడం ద్వారా మరో రూ.2 లక్షలు సంపాదించారు. దీంతో పాటు, ఒహ్రిస్ హోటల్ లో తెలంగాణ బ్రాండ్ ఐస్ క్రీమ్ ను విక్రయించి ఇంకో రూ.2 లక్షలు సంపాదించారు. మొత్తంమీద 'గులాబీ కూలీ'గా కేశవరావు రూ.6 లక్షలు సంపాదించారు.
మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో 'గులాబీ కూలీ'గా పని చేసి రూ.2 లక్షల 16 వేలు సంపాదించారు.
ఈ నెల 27న వరంగల్ లో టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఖర్చుల నిమిత్తం పార్టీకి చెందిన పలువురు నేతలు, నాయకులు 'గులాబీ కూలీ'లుగా మారుతున్నారు.