ధాన్యం సేకరణపై లోక్సభలో దుమారం.. చర్చకు టీఆర్ఎస్ ఎంపీలు పట్టు.. కేంద్రం తీరుపై నిరసన
తెలంగాణలో ధాన్యం సేకరణ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు సభలో నిరసనకు దిగారు. ఆహార ధాన్యాల సేకరణపై చర్చించాలని పట్టుబట్టారు. నిర్దిష్టమైన జాతీయ విధానం తీసుకురావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలోనూ కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలియజేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్..
ధాన్యం సేకరణపై చర్చించాలని టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఉభయసభల్లో చర్చకు పట్టుబట్టారు. కానీ ఉభయసభల్లోనూ చర్చకు అనమతి ఇవ్వలేదు. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ లోక్ సభ, రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
తెలంగాణలో వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో అమాయుకులైన రైతులు అన్యాయానికి గురవుతున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల పట్ల కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతలను రక్షించాలని కోరారు.
కేంద్రం తీరుతో రైతులకు అన్యాయం..
ధాన్యం సేకరణలో కేంద్రం ఎందుకు సమాధానం దాటవేస్తోందని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నించారు. ఒడిషాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కేంద్రం విధానంతో ఇబ్బందులుపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దీనిపై వారం రోజులుగా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజూ వాయిదా తీర్మానం ఇస్తున్నప్పటికీ లోక్సభ, రాజ్యసభలో చర్చకు అనుమతించడంలేదని మండిపడ్డారు.
తెలంగాణ రైతాంగాన్ని కించపరిచేలా కేంద్రం తీరు..
తెలంగాణ రైతాంగాన్ని కించపరిచేలా కేంద్రం పెద్దలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. రోజుకో మాట మాట్లాడుతూ బీజేపీ నేతలు పబ్బం గుడుపుకుంటున్నారని మండిపడ్డారు. పంజాబ్లో ఎలాగైతే ధాన్యాన్ని కొంటున్నారో అలాగే తెలంగాణలో వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వం తీరుతో దేశంలో రైతులను తీవ్రంగా నష్టపోతున్నారని దుయ్యబట్టారు. కర్షకులు, కార్మికులను ఇబ్బందులు పెట్టి.. కొందరికి కొమ్ముకాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందనన్నారు. వ్యవసాయంపై కనీస అవగాహన లేని పీయూష్ గోయల్ కేంద్ర ఆహార మంత్రిగా ఉండటం మన దురదృష్టకరమని పేర్కొన్నారు.