15న కేసీఆర్ అధ్యక్షతన కేసీఆర్ కీలక సమావేశం: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా చర్చ
హైదరాబాద్: తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం(నవంబర్ 15న) మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ విస్తృస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు.
సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై విశ్లేషణ జరగనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసుపైనా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నిక అనుభవాలు, ఓటింగ్ పై విశ్లేషించి తర్వాత దానిపై చర్చించనున్నట్లు సమాచారం. అంతేగాక, రానున్న రోజుల్లో బీజేపీ తీరును ఎలా ఎండగట్టాలి, కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరి ఎలా ఉండాలనే దానిపై చర్చ జరిగే అవకాశముంది. ప్రధాని మోడీతోపాటు బీజేపీ నేతలంతా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చు ప్రక్రియ కొనసాగుతోంది. బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ యంత్రాంగం ఏ విధంగా పనిచేయాలి, పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనేదానిపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
తాజాగా, ప్రధాని మోడీ పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కీలక భేటీ జరగం ప్రాధాన్యత సంతరించుకుంది.