గులాబీ పార్టీలో కొందరికి టిక్కెట్లు..! మరికొందరికి ఇక్కట్లు..!! ఇంకొందరికి బిస్కెట్లు..!!!
గులాబీ పార్టీలో టిక్కెట్ల లాబీయింగ్ మొదలైంది. సిట్టింగ్ లు తమ సీట్లను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆశావాహులు తమ అద్రుష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమౌతున్నారు. గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ కు అభ్యర్థులు కరవయ్యారు. కాని ఈ సారి మాత్రం ఆ పరిస్థితి లేదు. రంగారెడ్డి జిల్లాలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. దీంతో టిక్కట్ల కోసం పోటీ తీవ్రమైంది.కూకట్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావుతో పాటు మాజీ కార్పొరేటర్ హారీష్ రెడ్డి,గొట్టిముక్కల పద్మారావుతో పాటు ఒకరిద్దరు నాయకులు సీటు కోసం పోటీ పడుతున్నారు.కుత్భుల్లాపూర్ లో ఎమ్మెల్యే వివేక్ తో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు,కొలన్ హనుమంతరావు టిక్కట్ రేస్ లో ఉన్నారు.
శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు బండి రమేష్,శంకర్ గౌడ్ పోటీలో ఉన్నారు.ఎల్.బి నగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్ తో పాటు ఒకరిద్దరు కార్పొరేట్లు,కాచం సత్యనారాయణ టిక్కెట్ వేటలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ పడుతున్నారు. చేవేళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య తో పాటు మాజీ ఎమ్మెల్యే రత్నం తదితరులు టిక్కెట్ ఆశిస్తున్నారు.
కలగూర గంపలా మారిన టీఆర్ఎస్ పార్టీ.. ఎవరికి సీటు దక్కుతుందో తెలియని పరిస్థితి..!
హైదరాబాద్ లో టీఆర్ఎస్ లో పెద్దగా పోటీ ఉన్నట్లు కనిపించడం లేదు. సికింద్రాబాద్లో ఎమ్మెల్యే సాయన్నతో పాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలు టిక్కెట్ వేటలో ఉన్నారు.జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీతో పాటు మురళీ గౌడ్ 2019లో పోటీ కి సై అంటున్నారు.ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ టిక్కెట్ కు బాగా గిరాకీ ఉంది.కాంగ్రెస్ నుంచి చేరిన దానం నాగేందర్ ఖైరతాబాద్ నాదే అంటుండగా మన్నో గోవర్థన్ రెడ్డి, విజయారెడ్డి, విజయరామారావుతో పాటు సీనియర్ నేత కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి టిక్కెట్ వేటలో ఉన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప,మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య పోటీ పడుతున్నారు.మంచిర్యాలలో దివాకర్ రావుకు వ్యతిరేకంగా కొంతమంది టీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు. ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే రేఖానాయక్,మాజీ ఎం.పి రమేష్ రాథోడ్ పోటీపడుతున్నారు. ముథోల్ లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి,సీనియర్ నేత వేణుగోపాలా చారి మధ్య టిక్కెట్ పోరు ఉండనున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు తీవ్రంగా ఉంది. రామగుండంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు,స్థానిక టీఆర్ఎస్ నేతలకు పడటం లేదు. పెద్దపల్లి టిక్కెట్ కోసం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,ఎమ్మెల్సీ భాను ప్రసాద్ పోటీ పడుతున్నారు.చొప్పదండి లో ఎమ్మెల్యే బుడిగె శోభ,పెద్దపల్లి ఎం.పి బాల్క సుమన్ కు ఛాన్స్ ఉంది.
టీఆర్ఎస్ లోకి ప్రవాహంలా వచ్చి పడ్డ నేతలు..! ఉంటారో.. కొట్టుకుపోతారో తెలియదు..
ఉమ్మడిఖమ్మంజిల్లాలోపినపాక,ఇల్లెందు,మధిర,వైరా,అశ్వారావుపేటల్లో టీఆర్ఎస్ లో వర్గ పోరు ఖాయం.జిల్లాలోని దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో పాత టీఆర్ఎస్ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. వివిధ పార్టీ నుంచి వచ్చిన నేతలు పెత్తనం చేస్తుండటంతో 2019 ఎన్నికల కోసం అసలైన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా టీఆర్ఎస్ గ్రూపు పంచాయతీలు తీవ్రంగా ఉన్నాయి. కొడంగల్ లో ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కి సరిపడటం లేదు.నారాయణపేట్ లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి,పాత టీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర విభేదాలున్నాయి.మక్తల్ లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కి టీఆర్ఎస్ నాయకులతో సరిపడటం లేదు.ఆలంపూర్ లో టీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయింది.అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్,మాజీ ఎమ్మెల్యే రాములు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్,ఎడ్మ కిష్ణారెడ్డి మధ్య పోటీ నెలకొన్నది.
ఉన్న నాయకులకు తోడు యువరక్తం.. సమన్యాయం కష్టమే..!!
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆంధోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బాబుమోహన్, జర్నలిస్టు సంఘాల నేత క్రాంతి టిక్కెట్ వేటలో ఉన్నారు.ఉమ్మడి నల్గొండలో మిర్యాలగూడా నుంచి ఎమ్మెల్యే భాస్కర్ రావు, అమరేందర్ రెడ్డి,విజయసింహారెడ్డి లు పోటీ చేయడానికి సిద్ధమౌతున్నారు.దేవరకొండలో ఎమ్మెల్యే రవీంధ్రకుమార్, జడ్పీ ఛైర్మన్ బాలు నాయక్ టిక్కెట్ వేటలో ఉన్నారు.నాగార్జున సాగర్ లో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్యతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.హూజూర్ నగర్ లో ఇంఛార్జి శంకరమ్మతో పాటు ఎన్ ఆర్ఐ సైదిరెడ్డి అధికార పార్టీ తరుపున పోటీకి సై అంటున్నారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,శశిధర్ రెడ్డి రేస్ లో ఉన్నారు. మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,జడ్పీటీసీ బొల్ల శివ శంకర్ టిక్కెట్ ఆశిస్తున్నారు.
ఏ జిల్లా చూసినా టిక్కెట్ల డిమాండ్ ఫుల్లు.. సప్లై మాత్రం నిల్లు..
ఉమ్మడి వరంగల్ లో స్టేషన్ ఘన్ పూర్ సీటు కోసం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, డిప్యూటీ సి.ఎం కడియం శ్రీహరి పోటీ పడుతున్నారు.వరంగల్ ఈస్ట్ సీటుపైన ఎమ్మెల్యే కొండా సురేఖ తో పాటు మేయర్ నరేందర్ కన్నేశారు. భూపాలపల్లి లో ఎమ్మెల్యే మధుసుదనాచారి ,కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్,గండ్ర సత్యనారాయణరావు మధ్య పోటీ నెలకొన్నది.డోర్నకల్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్,మాజీ ఎమ్మెల్యే కవిత టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నది.
ఎన్నికల సమయం దగ్గర పడుతుంటంతో నేతలు తమ మనసులో మాటను బయటపెడుతున్నారు.బహిరంగంగానే వ్యాఖ్యానాలు చేస్తుండటంతో టీఆర్ఎస్ లో కుమ్ములాటలు బయటపడుతున్నాయి. మరి వీరద్దరిని కేసీఆర్ ఎలా కంట్రోల్ చేస్తారన్న దానిపైన ఆధారపడి గెలుపోటలు ఉండే ఛాన్స్ ఉంది.