హైదరాబాద్కు చంద్రబాబు: నోటుకు ఓటు కేసును ఎత్తిన టిఆర్ఎస్
హైదరాబాద్: మూడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు వచ్చిన నేపథ్యంలో మరోసారి ఓటుకు నోటు కేసు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో చంద్రబాబు చేత ప్రచారం చేయించాలని తెలంగాణ టిడిపి నాయకులు భావిస్తున్నారు. అయితే, అందుకు చంద్రబాబు అంగీకరించలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆసక్తికరమైన వార్తాకథనం అచ్చయింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తే తమకే మంచిదని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. నోటుకు ఓటు కేసుపై విచారణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబు ప్రచారం సాగిస్తే తమకే లాభం చేకూరుతుందని ఆయన అన్నారు.
అయితే, నోటుకు ఓటు కేసు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన అన్నారు. అయితే, నాయిని నర్సింహా రెడ్డి చెప్పినట్లు పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోకి దిగితే నోటుకు ఓటు కేసు విచారణను ఉధృతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా చంద్రబాబును కార్నర్ చేయడానికి అవసరమైన అన్ని ఎత్తుగడలను అనుసరించడానికి టిఆర్ఎస్ సిద్ధపడినట్లు అర్థమవుతోంది.
నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఎసిబి చీఫ్ ఎకె ఖాన్ వాదనను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో చేర్చింది. నోటుకు ఓటు కేసు సందర్భంగా వెల్లడైన టేపుల్లోని చంద్రబాబు గొంతును ధ్రువీకరించుకోవడానికి వాయిస్ రికార్డింగ్ కోసం ఎసిబి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 41వ సెక్షన్ కింద చంద్రబాబుకు సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
రాజకీయాంశాలతోనూ వ్యక్తుల హోదాతోనూ సంబంధం లేకుండా నోటుకు ఓటు కేసు విచారణలో తాము ముందుకు సాగాతామని ఎసిబి చీఫ్ తమతో చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.