సిద్దిపేట, సిరిసిల్లలో ఓట్లు తగ్గడం మీ పతనానికి సంకేతం : కేటీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగి సీట్లు రావడంతో .. ఆ పార్టీ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. వారికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ధీటుగానే కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ గట్టు మీద సవాళ్ల పర్వం కొనసాగుతుంది.
అగ్గిరాజేసింది ..?
మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు .. గెలుపే కాదని కేటీఆర్ అనడంతో మరోసారి అగ్గి రాజుకుంది. ఇందుకు కాంగ్రెస్ నేత రేవంత్ కూడా ధీటుగానే బదులిచ్చాడు. మీ పతనం మొదలైంది అంటూ కేటీఆర్కు బహిరంగ లేఖ రాశాడు. ప్రజల్లో టీఆర్ఎస్పై తిరస్కరణ పర్వం మొదలైందని పేర్కొన్నారు. దీంతో వాస్తవాన్ని జీర్ణించుకోలేక కుంటి సాకులు చెబుతున్నారని రేవంత్ విమర్శించారు. ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పోల్చుకోవాలే తప్ప .. ఐదేళ్ల కిందటి ఫలితాలను ఎలా బేరీజు వేసుకుంటారని ప్రశ్నించారు. ఇది మీ అతితెలివి తనానికి నిదర్శనమా అని నిలదీశారు.

అప్పటి లెక్కలు ఇప్పుడెలా ?
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు షేర్ తగ్గిపోయిందన్నారు. గతంలో కంటే 20 లక్సల ఓట్లు తగ్గిపోయాయని రేవంత్ గుర్తుచేశారు. సిద్దిపేట, సిరిసిల్లలే ఓట్లు తగ్గడమే మీ పతానికి సంకేతమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కరీంనగర్, నిజామాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడం టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని చెప్పారు. దానిని కప్పిపుచ్చుకునేందకు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. మల్కాజిగిరి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టి సరైన న్యాయం చేశారని కొనియాడారు. మిగతా నేతలను చులకన చేసి మాట్లాడటం సరికాదని కేటీఆర్కు సూచించారు. నేతలను అవమానిస్తే ప్రజాక్షేత్రంలో మీ అహంకారాన్ని అణచివేస్తారని గుర్తుచేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలతోనైనా మీకు కనువిప్పు కలుగాలి అని హితవు పలికారు. ఇప్పటికీ వైఖరి మారకుంటే .. ప్రజలు తిరస్కరించే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. ఇకనైనా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications