అన్నంతపని చేసిన కేటీఆర్.. ఫలితాల తర్వాతిరోజే కీలక ప్రకటన.. జూపల్లికి ఝలక్
అన్ని పార్టీల నుంచి వలసలు పెరగడం, టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడ్డ నేపథ్యంలో రెబల్స్ బెడదను నివారించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ మున్పిపల్ ఎన్నికలు ముందే తీవ్రస్థాయి హెచ్చరికలు చేసింది. పార్టీలోనే ఉంటూ హైకమాండ్ నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్లను సహించబోమని, తిరిగి వాళ్లను పార్టీలోకి చేర్చుకోబోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వాన్నింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఆయన అన్నంత పని చేసిచూపించారు.
సీఎం నియోజకవర్గంలోనే..
కొన్ని గంటల కిందట వెలువడ్డ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం తెలిసిందే. అయితే సిద్ధిపేట, నిజామాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ అంచానాలు తారుమారాయ్యాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోనే ఇండిపెండెంట్ల రూపంలో రెబల్స్ సత్తా చాటారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లోనూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లందరికీ టీఆర్ఎస్ హైకమాండ్ షాకిచ్చింది.
గెలిచినా గుబులే..
ఆయా డివిజన్లు, వార్డుల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కక రెబల్స్ గా పోటీచేసి గెలిచినవాళ్లంతా మళ్లీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు మండల, జిల్లా నేతలకు తమ మనసులోని మాట చెప్పుకుంటున్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి జూపల్లి నాయకత్వంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ లో మెజార్టీ సీట్లు గెలుచుకున్న రెబల్స్ కూడా తాము టీఆర్ఎస్ కు మద్దతిస్తామని, అవసరమైతే పార్టీలో చేరతామనీ ప్రకటించారు. కానీ వాళ్లెవరినీ పార్టీలో చేర్చోకోబోమని టీఆర్ఎస్ హైకమాండ్ ఆదివారం ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే ఈ ప్రకటన వెలువడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో గెలిచిన రెబల్స్ లో గుబులు రెట్టింపైంది.
జూపల్లికి ఝలక్..
కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుండగా ఉండగా , జూపల్లి వర్గం 11స్థానాలను కైవసం చేసుకుంది. మిగతా 9 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు చూసి డంగైన జూపల్లి వర్గం తాము టీఆరెస్ నాయకత్వం చెప్పినట్లుగా నడుచుకుంటామని కాళ్లబేరానికి వచ్చింది. ఆ మేరకు జూపల్లే స్వయంగా హైదరాబాద్ రాగా.. ఆయనకు కేటీఆర్ అపాయింట్ మెంట్ దొరకలేదు. రెబల్స్ ను మళ్లీ పార్టీలో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతోనే కేటీఆర్ అందుకు నో చెప్పారు. జూపల్లి వర్గం కౌన్సిలర్లను చేర్చుకోకుండానే.. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేలా టీఆర్ఎస్ పథకరచన చేసింది.