పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం..!!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనున్న తరుణంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులను ఆమోదించేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పెండింగ్ బిల్లుల్లో మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి ఆ రెండు బిల్లులను తిరిగి పపించారు. మరో రెండు బిల్లులను పెండింగ్లో పెట్టారు.
గవర్నర్ వర్సస్ ప్రభుత్వం అన్నట్లుగా సాగుతున్న పరిణామాల క్రమంలో అనూహ్య నిర్ణయాలు జరుగుతున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళి సై వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేశారు.మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. దీని పైన సుప్రీంకోర్టు ఈ రోజు (సోమవారం) విచారణకు నిర్ణయించింది.

ఇదే సమయంలో బిల్లులపైన గవర్నర్ తన నిర్ణయం వెల్లడించారు. బిల్లులపై వ్యవహారం పైన గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ ఇంతకుముందే చర్చించారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. గవర్నర్ తీరు మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా ఉందని కేసీఆర్ సర్కారు చెబుతోంది. ఇటువంటి విచక్షణాధికారాలు గవర్నర్కు ఉండవని ప్రభుత్వం అంటోంది. రాష్ట్రానికి సంబంధించిన ఆయా బిల్లులను గవర్నర్ పెండింగ్లో పెట్టడానికి న్యాయమైన కారణాలు ఏవీ లేవని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు నెలలు గడుస్తున్నా బిల్లులకు ఆమోదం లభించలేదని పలువురు మంత్రులు ఇప్పటికే చెప్పుకొచ్చారు. దీంతో వేరే మార్గం లేకే ప్రత్యేక పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సర్కారు చెబుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు గవర్నర్ తన వద్ద ఉన్న బిల్లుల విషయంలో తాజాగా నిర్ణయం వెల్లడించారు. దీంతో, ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications