రైతుబంధుకు రూ.6900 కోట్లు, కోడ్ ముగిసాక ఖాతాల్లో జమ
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మరో మూడురోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే చల్లని వాతావరణం ఉంది. మరో వారంలో వరుణ దేవుడ పుడమితల్లిని సృశించనున్నాడు. దీంతో పంట కోసం అన్నదాత సమాయత్తమవుతుండగా .. ఖరీఫ్ పంట కోసం తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం విడుదల చేసింది.
పెట్టుబడి సాయం ...
రైతులు పంట వేసేందుకు విత్తనాలు, యూరియాకు ఇబ్బంది పడొద్దని తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తోన్న సంగతి తెలిసిందే. తొలుత ఎకరానికి 4 వేలు ఇచ్చిన ప్రభుత్వం .. ఈసారి దానిని రూ.5 వేలు చేసింది. రాష్ట్రంలోని రైతుల కోసం రూ. 6900 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ ఉండటంతో .. ముగిసాక రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతుల ఉత్తర్వులను సోమవారం వ్యవసాయశాఖ జారీచేసింది.

పెంచిన సర్కార్ ..
మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పంట పెట్టుబడి సాయం ఎకరానికి రూ.5 వేలు చేస్తామని ఎన్నికల సందర్భంగా కేసీఆర్ హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయాన్ని పెంచారు. స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. 7,8 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక ముగుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పూర్తవుతుంది. తదనంతరం పెట్టుబడి సాయం అందజేస్తామని ... విడతల వారీగా నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తామని స్పష్టంచేసింది ప్రభుత్వం. రైతు బంధుతోపాటు .. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే .. బీమాను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications