గ్లోబరీనా గురించి తెలియదు! తండ్రిగా వారి బాధను అర్థం చేసుకోగలను!
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాసేపు నెటిజన్లతో ముచ్చటించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో లైవ్లో పాల్గొన్న ఆయన... వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను ప్రజలతో పంచుకున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై స్పందించిన ఆయన.. తండ్రిగా ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకోగలనని అన్నారు. ట్విట్టర్ వేదికగా జరిగిన ఆస్క్ కేటీఆర్ లైవ్లో ఆయన దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పారు.
ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయి : తప్పుచేసినవారిపై చర్యలు, జనార్ధన్ రెడ్డి స్పష్టీకరణ
గ్లోబరినా గురించి తెలియదు
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో గందరగోళంపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఈ సమస్యను మరింత వివాదాస్పదం చేయవద్దని కోరారు. ఇంటర్ బోర్డు విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండంటూ వచ్చిన ప్రశ్నకు ఇంకేం క్లారిటీ కావాలో మీరే చెప్పండి సర్ అని బదులిచ్చారు. జరిగిన ఘటనపట్ల తాను బాధపడుతున్నానని, ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఒక తండ్రిగా పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇంటర్ గందరగోళానికి కారణమైన గ్లోబరినా గురించి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తాను ఆ పేరు గతంలో ఎప్పుడూ వినలేదని చెప్పారు.
కేంద్రంలో చక్రం తిప్పుతాం
కేంద్రంలో మోడీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నకు సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీకి మెజార్టీ రాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈసారి హంగ్ ఏర్పడటం ఖాయమని అన్నారు. కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా అనే ప్రశ్నకు మే 23 తర్వాత పరిస్థితి మీకే అర్థంవుతుందని జవాబు చెప్పారు.
ఏపీ సీఎంను ప్రజలే నిర్ణయిస్తారు
ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు మే 23న సమాధానం దొరుకుతుందని అన్నారు కేటీఆర్. జగన్, చంద్రబాబుల్లో ఎవరు సీఎంగా ప్రమాణం చేస్తారని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏపీకి చెందిన ఎమ్మెల్యే చేస్తారని చమత్కరిస్తూ లాఫింగ్ ఎమోజీని పోస్ట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిని ఆంధ్రా ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
ప్రజా సమస్యలు తీర్చే ప్రతినిధిని
ఏ శాఖ మంత్రి కాకపోయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు తలదూరుస్తున్నారు? రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారా అని ఒక నెటిజన్ అడగగా దానిపై స్పందించిన కేటీఆర్ తాను ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అయినందునే అలా చేస్తున్నానని చెప్పారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే హక్కు తనకుందని, దీనివల్ల వచ్చిన సమస్యేంటని కేటీఆర్ ప్రశ్నించారు.
నిజామాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కుట్ర
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో రైతులు పోటీ చేయడంపై కేటీఆర్ స్పందించారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ రాజకీయంలో భాగమని చెప్పారు. పసుపు రైతుల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని, టర్మరిక్ బోర్డు ఏర్పాటుతో పాటు గిట్టుబాటు ధర కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు.