ఆంధ్రా సరిహద్దు దాకా తరిమి తరిమి కొడ్తాం: రేవంత్ జిల్లాలో హరీష్ హెచ్చరిక
హైదరాబాద్/మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో పుట్టి ఆంధ్రా నేతల కొమ్ము కాస్తున్న టిడిపి నేతలను ఆ రాష్ట్ర సరిహద్దుల దాకా తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.
తెలంగాణ టిడిపి నేతలు ఆంధ్రా నేతల పాటకు వంత పాడుతున్నారన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవాలన్న కుయుక్తితో, సిడబ్ల్యూసికి టిడిపి లేఖ ఇచ్చిందని ఆరోపించారు. తక్షణం ఏపీ ఆ లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేసేలా ప్రవర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇక్కడి టిడిపి నేతలు ప్రశ్నించాలన్నారు. లేదంటే వారిని ప్రజలు క్షమించరని చెప్పారు. మంత్రులు జూపల్లి కృష్ణా రావు, హరీష్ రావులు పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గోదావరి పుష్కరాలపై సిఎం కెసిఆర్ ఇవాళ సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం మాట్లాడారు.
భక్తుల రద్దీని అధికారులు వివరించారు. పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రద్దీని తట్టుకునే విధంగా ఆర్టీసీ బస్సులను నడపాలని పేర్కొన్నారు.
కాగా, ఇవాళ డి శ్రీనివాస్ నివాసానికి కెసిఆర్ వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు డీఎస్ నివాసానికి చేరుకుని పలు అంశాలపై చర్చించనున్నారు. డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లో తాను స్వయంగా డీఎస్ నివాసానికి వెళ్తానని, వివిధ అంశాలపై ఆయనతో చర్చిస్తానని చెప్పారు.