హామీలు ఘనం.. ఆచరణ శూన్యం: కేటీఆర్ హామీకి వసంతం పూర్తి
ఏడాది గడిచినా ఇప్పటి వరకూ చేనేతకు ప్రత్యేక విధాన రూపకల్పన సంగతి పక్కనబెడితే, కనీసం ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదనలూ చేపట్టకపోవటం గమనార్హం.
హైదరాబాద్: చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. చేనేత, జౌళి రంగ పరిశ్రమలను విడదీసి వేర్వేరు విధానాలు ప్రకటిస్తామని 2016 జూలై 22వ తేదీన హైదరాబాద్లో చేనేత రంగ ప్రతినిధులతో, ఆగస్టు ఏడవ తేదీన రవీంద్రభారతిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం వేడుకల్లోనూ ఆయన నొక్కి చెప్పారు.
ఇది జరిగి ఏడాది గడిచినా ఇప్పటి వరకూ చేనేతకు ప్రత్యేక విధాన రూపకల్పన సంగతి పక్కనబెడితే, కనీసం ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదనలూ చేపట్టకపోవటం గమనార్హం. 'బడ్జెట్లో చేనేతకు, జౌళికి కలిపే నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో నూటికి 90 శాతం జౌళిరంగానికే పోతున్నాయి. మిగిలిన అరకొర నిధులు.. ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసుల నిర్వహణకే సరిపోతుండటంతో చేనేత రంగం నానాటికీ దివాళా తీస్తున్నది. దీంతో తెలంగాణలోని చేనేత కార్మికుల ఉపాధి, వృత్తి రక్షణ, వారి అభివృద్ధి గాల్లో దీపంలా మారింది.
సిరిసిల్ల, వరంగల్ టెక్స్ టైల్ పార్కులకే ప్రాధాన్యం ఇలా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో చేనేత, జౌళి రంగాలకు కలిపి రూ.83 కోట్లను కేటాయించింది. ఇదీకాక బీసీల కోసం కేటాయించిన బడ్జెట్లో రూ.1,200 కోట్లను చేనేత, జౌళి రంగాలకు కోసం ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొన్నది. కానీ అందులో చేనేతకు కేటాయించింది కేవలం రూ.373 కోట్లే. మిగతా రూ.827 కోట్లను వరంగల్, సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కుల నిర్మాణం కోసం వినియోగించాలని ప్రభుత్వం సూచించిందని అధికారులు వివరించారు.
జీఎస్టీ మినహాయింపునకు ఒకే
మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా చేనేతపట్ల అత్యంత వివక్ష ప్రదర్శిస్తున్నది. దేశంలో వ్యవసాయం తర్వాత అతి ప్రధానమైన చేనేత రంగాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. ఈ రంగంపై ఏకంగా 18 శాతం పన్నును విధించింది. దీంతో నూలు, పట్టు, రసాయనాలు, రంగులు, ఇతర ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జీఎస్టీ అమలుకు ముందు రూ.3,500 గా ఉన్న కిలో పట్టు ధర ఇప్పుడు ఏకంగా రూ.4,100కు పెరిగింది. ఇది వస్త్రాల ఉత్పత్తి మీద పెను ప్రభావం చూపింది. ఫలితంగా వాటి ధరలు పెరగటంతో కొనుగోళ్లు తగ్గాయని చేనేత కార్మికులు, వ్యాపారులు వాపోతున్నారు. జీఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఫలితం కాన రాలేదని ఒక చేనేత శాఖ అధికారి చెప్పారు.
ఇలా చేనేత రంగ పరిరక్షణ
ఇన్ని సమస్యల నేపథ్యంలో చేనేత రంగ పరిరక్షణకు అవసమైన కార్యాచరణ రూపకల్పన చేయాలని దక్షిణాది రాష్ట్రాల చేనేత సంఘాల సమన్వయ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళకు చెందిన ప్రతినిధులతోపాటు రాష్ట్రంలోని ఇతర చేనేత కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు, నిపుణులు పాల్గొంటున్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు చేనేత కార్మికులు సిద్ధం అవుతున్నారు.
జీఎస్టీ భారంతో చేనేత తల్లకిందులు
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ చేనేతపై వివక్ష కొనసాగుతూనే ఉన్నదని పద్మ శ్రీ పురస్కారం పొందిన చేనేత కళాకారుడు గజం అంజయ్య చెప్పారు. చేనేత రంగం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే వీటికి కారణం. ప్రభుత్వాలు దేశంలోని పెద్ద పెద్ద వస్త్ర పరిశ్రమలు, బడా షాపింగ్ మాల్స్కు లబ్ది చేకూర్చే విధంగా పథకాలు, కార్యక్రమాలు రూపొందిస్తున్నాయన్నారు.. ఈ కోణంలోంచి పుట్టుకొచ్చిందే చేనేత పై జీఎస్టీ అని, దీనిపై 12 శాతం నుంచి 18 శాతం వరకూ పన్నులు విధించటం వల్ల కుటీర పరిశ్రమ చేనేత విలవిల్లాడుతున్నదరి ఆయన చెప్పారు. నూలుపై 12 శాతం, జరీపై 12 శాతంతోపాటు తయారైన వస్త్రాలపై 5 శాతం పన్నును విధించారు. వీటిని ఉపసంహరించక పోతే చేనేత మనుగడ ప్రశ్నార్థకమవుతుందని గజం అంజయ్య స్పష్టం చేశారు.
పన్నుల భారం భరించలేక ఇలా
చేనేతకు ప్రత్యేక పాలసీ లేకపోవటం వల్ల ఆ రంగం నానాటికీ నిర్వీర్యమై పోతున్నదని చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తే.. అందులో వృత్తి పరిరక్షణకు కొన్ని నియమ, నిబంధలను జొప్పిస్తారని, వాటిని అతిక్రమించి ఎలాంటి పన్నులు, ట్యాక్స్లు విధించే అవకాశం ఉండదని అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేక విధానం లేకపోవటం వల్ల చేనేతపై కేంద్రం జీఎస్టీని 18 శాతం విధించిందని, ఇది పరోక్షంగా బడాబడా టెక్స్టైల్ కంపెనీలకు లాభం చేకూరుస్తున్నదని, చిన్నాచితకా వృత్తిదారులు ఈ పన్నుల భారాలను మోయలేక వృత్తిని వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.