కేంద్రంతో తాడో పేడో తేల్చుకుందాం.. తెలంగాణకు నయాపైసా ఇవ్వలేదు : కేటీఆర్
కేంద్ర ప్రభుత్వంపై మరో సారి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. పేదలను పొట్టలు కొట్టి పెద్దలకు పంచుతుందని ఆరోపణలు గుప్పించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత కార్మికులను మోసం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు.
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకం
కేంద్రం ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంచడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. చేనేత కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉన్న జీఎస్టీ పెంపును వెంటనే దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కేంద్రంపై నిప్పులు చెరిగారు . వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని పెంచడానికి వ్యతిరేకంగా కేంద్రంపై నేత కార్మికులు ఉద్యమించాలన్నారు. వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు
నయాపైసా కూడా సాయం చేయలేదు..
మోదీ ప్రభుత్వం ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా.. తెలంగాణకు ఒక్క నయాపైసా కూడా సాయం చేయలేదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వాలని అనేక సార్లు కోరామని తెలిపారు. అంటే కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో 11 చేనేత క్లస్టర్లు ఇవ్వాలని మొరపెట్టుకున్నాం అయినా కేంద్రం స్పందించలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇంతవరకు ఒక్క రూపాయి సాయం కూడా సాయం అందలేదని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
నేతన్నల ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు
ఐదు రాష్ట్రాలలో ఎన్నికలను, అక్కడున్న నేత కార్మికులను దృష్టిలో పెట్టుకుని, దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. జీఎస్టీని పెంచితే వస్త్ర వ్యాపార పరిశ్రమ దారుణంగా దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకోనే కేంద్రం దీన్ని కొద్దిరోజులు తాత్కాలికంగా వాయిదా వేసిందన్నారు. జీఎస్టీ పెంపుపై అవసరమైతే నేతన్నలందరూ రోడ్డెక్కి ఉద్యమం చేయాలన్నారు. నేతన్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
సిరిసిల్లకు వరాలు
తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. విపక్షాలు లేనిపోని సమస్యలు సృష్టించి పబ్బం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ప్రజలకు తాను రుణ పడి ఉంటానని అన్నారు. సిరిసిల్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. సుమారు 16.5 కోట్లతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు.