సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారు- ఏపీ నడవాలంటే ఢిల్లీ నిధులు కావాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలనం..
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన వివాదాస్పద వ్యాఖ్యాలు చేసారు. గతంలో పోతిరెడ్డి పాడు నీటి గురించి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం తో పాటుగా ఆయన తండ్రి వైఎస్సార్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లందరూ తెలంగాణ వ్యతిరేకులేనంటూ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఆ తరువాత వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్రెడ్డి వివరణ ఇచ్చారు.

జగన్ పైన గతంలోనూ వ్యాఖ్యలు
ఈ మేరకు లేఖ విడుదల చేసిన ఆయన.. తమ రాష్ట్రంలోని మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం రైతుల పొట్టగొట్టే అక్రమ ప్రాజెక్టులు కట్టిన, కట్టే ప్రయత్నం చేస్తున్న ఆంధ్ర పాలకులను ఉద్దేశించే తాను మాట్లాడానని, రాయలసీమ, ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి కాదని మంత్రి పేర్కొన్నారు. దీని పైన ఏపీ మంత్రులు..వైసీపీ నేతలు సైతం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇక, ఇప్పుడు తాజాగా మరోసారి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ తరహాలోనే వ్యాఖ్యలు చేసారు. టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా రైతు ధర్నాలు నిర్వహించింది.

ఏపీ సీఎం కేంద్రాన్ని అడుక్కుంటున్నారు
నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన ధర్నాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఆంధ్రా సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే.. అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేసారు. కేంద్రం వారి పైన ఒత్తిడి చేసి మీటర్లకు మోటార్లు పెట్టమని ఒత్తిడి చేసారని చెప్పారు. ధర్నా చేయాలని ఎలా అనిపించిందని బీజేపీ నాయకులపై కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ప్రశాంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు కావాలని ఎద్దేవా చేసారు.

ఏపీలో లాగా మోటార్లకు మీటర్లు పెట్టం
కేంద్రం ఒత్తిడి తో ఏ.పి. లో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టారన్నారు. దేశం మొత్తం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలనే మోడీ ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ లో మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. కేంద్రం రైతులకు చేస్తున్న మోసం పై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో కేంద్రం విధించిన షరతుల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయించింది. అయితే, ఉచిత విద్యుత అందిస్తుండటంతో తామే మొత్తం చెల్లిస్తామని... ఆ బిల్లులు ఎంత వచ్చినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ స్పష్టం చేసింది. ఇక, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఏపీ మంత్రులు..అధికార వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications