539 ఎస్సై కొలువుల భర్తీకి ప్రకటన : 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను దశలవారీగా పరిష్కరిస్తూ వస్తున్న ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖలో 539 సబ్ ఇన్స్పెక్టర్(ఎస్సై) ఉద్యోగాల భర్తీకి శనివారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వచ్చే నెల మూడో తేదీ అర్ధరాత్రి వరకు ఆన్లైన్ (www.tslprb.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష ఏప్రిల్ 17న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. జనవరిలో 9281 పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తుకు గురువారం అర్ధరాత్రితో గడువు ముగిసింది. ఎస్సై ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసు నియామక మండలి శనివారం ప్రకటన విడుదల చేసింది.
భర్తీకానున్న వాటిలో 208 సివిల్, 74 సాయుధ(ఏఆర్), 2 ఎస్ఏఆర్, 205 టీఎస్ఎస్పీ, 12 ప్రత్యేక భద్రత దళం(ఎస్పీఎఫ్), 29 పీటీవో, కమ్యూనికేషన్స్ ఎస్సైలు, తొమ్మిది అగ్నిమాపక అధికారుల పోస్టులు ఉన్నాయి. ఓసీ, బీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.500 కాగా, ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు.
ఎస్సైల ఉద్యోగాలకు 2016 జులై మొదటి తేదీ వరకు 21 ఏళ్లు పూర్తి చేసుకునే అభ్యర్థులు (గరిష్ఠ వయోపరిమితి 26 ఏళ్లు), అగ్నిమాపక అధికారి పోస్టుకు 18 ఏళ్లు నిండినవారు (గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు) అర్హులు.
కాగా, పోలీస్ శాఖలో మహిళల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పోలీస్ నియామకాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లను తీసుకువచ్చింది. సివిల్ విభాగంలో మూడోవంతు (33 1/3 శాతం), ఏఆర్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయిస్తున్నట్టు నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టంచేసింది.
2016 జులై మొదటి తేదీ నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి. ఇతర వివరాల కోసం నియామక మండలి వెబ్సైట్లోని వివరాలు పరిశీలించాలని మండలి ఛైర్మన్ పూర్ణచందర్రావు సూచించారు.