క్రీమీలేయర్ గొడవ, పుట్టింటి సర్టిఫికెట్కు పట్టు : ఇవీ టీఎస్పీఎస్సీ లీలలు
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడని సామెత. బీసీల పిల్లలకు మంచి విద్యాబుద్దులు చెప్పించడానికి గురుకులాలు ఏర్పాటుచేస్తోంది కేసీఆర్ సర్కార్.
హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడని సామెత. తెలంగాణలో ప్రభుత్వం ఒకటి చెబితే.. మరో వైపు ప్రభుత్వ పరిధిలోని ఇతర సంస్థలు మరో పని చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల పిల్లలకు మంచి విద్యాబుద్దులు నేర్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
ప్రత్యేకించి బీసీల కోసం ఏర్పాటుచేసిన గురుకులాల్లో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటుండగా, ఆ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇష్టానుసారంగా పెట్టిన నిబంధనలు నిరుద్యోగ యువతకు ప్రత్యేకించి మహిళలకు కష్టాలు తెచ్చి పెట్టాయి. ఆ నిబంధనలతో పెండ్లయిన కొంతమంది బీసీ మహిళా అభ్యర్థుల మెడపై కత్తి వేలాడుతున్నది. బీసీ మహిళలు తమ పుట్టింటి నుంచి బీసీ క్రీమీలేయర్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని టీఎస్పీఎస్సీ పేర్కొన్నది.
నాన్ క్రీమీలేయర్ బీసీ అభ్యర్థులు తండ్రి పేరుతో ఆ పత్రం తేవాలని నిబంధన ఉంది. అలా తేని వారు ఓసీ జనరల్ కేటగిరీగాపరిగణించబడుతారని టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఈ నిబంధనను చూసి బీసీ మహిళా అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. బీసీ పురుషులు, పెండ్లికాని అమ్మాయిలకు తండ్రి పేరుతో ఆ పత్రం తెచ్చేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవు. కానీ పెండ్లయిన బీసీ మహిళలకే సమస్యలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ తండ్రి పేరుతోనే నాన్ క్రీమీలేయర్ పత్రం తేవాలన్న నిబంధన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. దీనిపై ప్రభుత్వం చర్చించి బీసీ మహిళలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని విద్యార్థి, యువజన సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి.

మరోలా టీఎస్పీఎస్సీ షరతులు
బీసీ అభ్యర్థులు నాన్ క్రీమీలేయర్ పత్రం బీసీ అభ్యర్థులు 2015, డిసెంబర్ 18న జారీ చేసిన మెమో ప్రకారం తండ్రి పేరుతో తేవాలని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఆ మెమోలో ఎక్కడా తండ్రి పేరుతోనే నాన్ క్రీమీలేయర్ పత్రం తేవాలన్న నిబంధన లేదు. ఆ మెమోను 2014, నవంబర్ 13వ తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 8 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జీవోలోనూ ఎక్కడా తండ్రి పేరుతోనే నాన్ క్రీమీలేయర్ పత్రం తీసుకోవాలన్న నిబంధన విధించలేదు. మరి టీఎస్పీఎస్సీ పెట్టిన నిబంధన ఎక్కడ నుంచి వచ్చిందన్నది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇంకోవైపు ఏ మెమో ప్రకారం తండ్రి పేరుతోనే నాన్ క్రీమీలేయర్ పత్రం తేవాలని టీఎస్పీఎస్సీ నిబంధన విధించిందో ఆ మెమోలోని దరఖాస్తు ఫారం నమూనాను ప్రభుత్వం ప్రకటించింది. ఆ నమూనాలోనూ దరఖాస్తుదారుని పేరు, జెండర్, పుట్టినతేదీతోపాటు తండ్రి లేదా భర్త పేరు, తండ్రి/ భర్త వృత్తి వంటి అంశాలనూ పొందుపరిచింది.

పరస్పర విరుద్ధ సర్టిఫికెట్లతో ఇలా దరఖాస్తుల తిరస్కరణ
దరఖాస్తు దారులు తండ్రి పేరుతో గానీ, భర్త పేరుతో గానీ నాన్ క్రీమీలేయర్ పత్రాన్ని పొందవచ్చు. టీఎస్పీఎస్సీ నిర్ణయంతో పెండ్లయిన బీసీ మహిళలు నాన్ క్రీమీలేయర్ పత్రాన్ని తండ్రి పేరుతో పొందలేక నానాకష్టాలు పడుతున్నారు. పెండ్లయిన తర్వాత భర్త పేరుతో ఉన్న ఆధార్, ఓటర్, రేషన్, నివాస ధ్రువపత్రాలను మళ్లీ మార్చాల్సి ఉంటుంది. ఇవి మార్చాలన్నా ఎన్నో తిప్పలు పడాల్సిందే. ఎందుకంటే బీసీ కులధ్రువీకరణ పత్రం, ఆదాయ, నాన్ క్రీమీలేయర్, ఆధార్, ఓటరు, రేషన్, నివాస ధ్రువపత్రాలన్నింటా తండ్రి పేరుతోనే ఉండాలి. కొన్నింటిలో భర్తపేరు, మరికొన్నింటిలో తండ్రి పేరు ఉంటే టీఎస్పీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలనలో ఆ అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యే ముప్పు పొంచి ఉన్నది.

బీసీ క్రీమీలేయర్ పరిమితి ఇలా
టీఎస్పీఎస్సీ అనాలోచితంగా పొందుపరిచిన నిబంధనతో బీసీ మహిళా అభ్యర్థులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 2014, జులై 28న బీసీ రిజర్వేషన్లు, క్రీమీలేయర్ అమలుకు సంబంధించిన సర్క్యులర్ నెంబర్ ఇ/424/2014లో మాత్రం నిబంధనలు విడుదల చేసింది. క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి) అంటే ఎవరు, నాన్ క్రీమీలేయర్ అంటే ఎవరనేది వివరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తారు.
వారికి బీసీ రిజర్వేషన్లు వర్తించవు. వార్షికాదాయం రూ.6 లక్షల కంటే తక్కువున్న వారినే నాన్ క్రీమీలేయర్గా పరిగణిస్తారు. వారికే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. తాజాగా కేంద్రం ఇటీవల రూపొందించిన నిబంధనల ప్రకారం ఓబీసీల్లో రూ.8 లక్షల లోపు ఆదాయం కల వారు నాన్ క్రీమీ లేయర్ గా పరిగణిస్తున్నారు. టీఎస్ పీఎస్సీ పెట్టిన నిబంధనల్లోని ఎనిమిదో అంశంలో బీసీ స్త్రీల విషయంలో ఆమె తల్లిదండ్రుల స్థితిని బట్టి క్రీమీలేయర్ను నిర్ణయించాలని, ఆమె భర్త స్థితిని బట్టి కాదని పొందుపరిచింది.

పుట్టింటి పేరిట సర్టిఫికెట్ల జారీకి రెవెన్యూశాఖ నో
‘నేను టీఎస్పీఎస్సీ ప్రకటించిన గురుకుల పీజీటీ రాతపరీక్ష రాశాను. పీజీటీ తెలుగు, ఉర్దూ ఫలితాలు వెలువడ్డాయి. బీసీ నాన్ క్రీమీలేయర్ ధ్రువపత్రం తండ్రి పేరుతో పొందాలని టీఎస్పీఎస్సీ ఓ నిబంధన విధించింది. నాకు 2006లోనే పెండ్లయింది. నా ఇంటి పేరు మారిపోయింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్కార్డులో చిరునామా మారడంతోపాటు తండ్రి పేరు స్థానంలో భర్త పేరు చేరింది. మా పుట్టినిల్లు, మెట్టినిల్లు జనగామ జిల్లాలోనే వేర్వేరు మండలాలు. ఇప్పటికే నేను మా ఆయన పేరుతో నాన్ క్రీమీలేయర్ పత్రం తీసుకున్నాను.
టీఎస్పీఎస్సీ నిబంధన చూశాక షాక్ తిన్నాను. పెండ్లయ్యాక తండ్రి పేరుతో నాన్ క్రీమీలేయర్ ఎలా తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. అయినా మా తండ్రికి చెందిన మండల కేంద్రానికి వెళ్లి ఆదాయం, నాన్ క్రీమీలేయర్ ధ్రువపత్రాలు కావాలని దరఖాస్తు చేశాను. ఇక్కడ నివాసం ఉంటున్నట్టు, తండ్రి మీద ఆధారపడి జీవిస్తున్నట్టు ఎలాంటి ఆధారం లేనందున ఇవ్వలేమని రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు' అని ఓ బాధిత మహిళ కన్నీరుమున్నీరయ్యారు. ‘నాకు 2010లో పెండ్లయింది. మాది రంగారెడ్డి జిల్లా. మా తల్లిదండ్రులది వరంగల్ అర్బన్. టీఎస్పీఎస్సీ నిబంధన చూసి వరంగల్ అర్బన్ రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాను. నాకు పెండ్లయినందున ఇచ్చేది లేదని ఆ అధికారులు అన్నారు. ‘టీఎస్పీఎస్సీ నిబంధనను అక్కడి తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్తే పరిశీలించి ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారు' అని మరో మహిళ చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకత్వం వహించాలని అభ్యర్థనలు
టీఎస్పీఎస్సీ తండ్రి పేరుతోనే నాన్ క్రీమీలేయర్ పత్రం తేవాలని ప్రకటించినట్టుగా కొందరు నిపుణులు చెప్తున్నారు. ఈ నిబంధనను ఎత్తేయాలని, తండ్రి లేదా భర్త పేరుతో నాన్ క్రీమీలేయర్ పత్రం తెచ్చుకునే విధంగా నిబంధనలు మార్చాలని, టీఎస్పీఎస్సీకి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు. జీవో నెంబర్ 8, మెమో నంబర్ 3009 ప్రకారం తండ్రి పేరు ఎక్కడా లేనందున భర్త పేరుతో నాన్ క్రీమీలేయర్ పత్రం పరిగణిస్తామని టీఎస్పీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కోచింగ్లకు వెళ్లి కష్టపడి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రిలిమినరీలో, మెయిన్స్లో ఉత్తీర్ణులై తీరా ధ్రువపత్రాల పరిశీలనలో ఈ కారణంతో తిరస్కరణకు గురైన తమ బాధలు వర్ణనాతీతం అని, ఈ నిబంధనను సవరించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications