TSPSC: తెలంగాణలో మొదలైన ఉద్యోగ నోటిఫికేషన్లు.. ఆ రెండు యూనివర్సిటీల్లో ఖాళీలకు నోటిఫికేషన్
నోటిఫికేషన్ల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 127 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు-15, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-10,ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులు-102 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ను ఏప్రిల్ 1 సాయంత్రం 5 గంటల నుంచి టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) తాత్కాలిక చైర్మన్గా ప్రొఫెసర్ చింతా సాయిలు నియమితులైన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో... ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో మిగిలిన ఏకైక సభ్యుడు సాయిలు తాత్కాలిక చైర్మన్గా నియమితులయ్యారు. పూర్తిస్థాయి చైర్మన్ నియామకం జరిగే వరకు సాయిలు ఈ పదవీలో కొనసాగనున్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా రిటైర్డ్ అయ్యాక టీఎస్సీఎస్సీ తాత్కాలిక చైర్మన్తో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తాజాగా మరో 5వేల ఖాళీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సాగర్ ఉపఎన్నిక తర్వాత వరుసగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్లోనే 50వేల ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... ఎమ్మెల్సీ ఎన్నికలు,సాగర్ ఉపఎన్నిక కారణంగా నోటిఫికేషన్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో ఇప్పటికే అభ్యర్థులు ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆలస్యం జరగడంతో సాగర్ ఉపఎన్నిక ముగిసిన వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.