టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్: టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు; కేసీఆర్ సంచలన నిర్ణయం?
టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న కేసీఆర్ టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చెయ్యాలని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పేపర్ల లీకేజీ పై సిట్ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ల లీకేజీ దందా ఎప్పటి నుండో కొనసాగుతున్నట్టు అనేక ఆధారాలు దొరికాయి. మరోవైపు రాజకీయంగా కూడా ఈ పేపర్ ల లీకేజీ వ్యవహారం దుమారం రేపింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ దుమారానికి కారణం అయ్యింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డిని ప్రగతి భవన్ కు పిలిపించుకోగా హుటాహుటిన జనార్ధన్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్ళారు. ఈ విషయంపై ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు తోను, కేటీఆర్ తోనూ సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. పేపర్ల లీకేజ్, పరీక్షల రద్దు, పేపర్ల లీకేజ్ కు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై కేసీఆర్ వారితో చర్చించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రగతి భవన్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో భేటీ అయిన కేసీఆర్ మాజీ చైర్మన్ గంట చక్రపాణి తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.

సీఎంఓ అధికారి నర్సింగరావు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి తో కూడా సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై సీరియస్ గా చర్చిస్తున్నారు. ఈ వ్యవహారంపై జనార్దన్ రెడ్డితో భేటీ తర్వాత టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని సంచలన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకోబోతున్నారు అన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కెసిఆర్ ఇదే నిర్ణయాన్ని తీసుకుంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థానంలో, పరీక్షల నిర్వహణకు ఏం చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.













Click it and Unblock the Notifications