TSRTC: హైదరాబాద్ సిటీలో కొత్త బస్సులొచ్చేశాయ్- ప్రత్యేకతలివే: సింగిల్ కార్డ్తో..!!
హైదరాబాద్: జంటనగరాల్లో ఇక కొత్తగా ఎలక్ట్రిక్ ఏసీ సిటీ బస్సులు పరుగులు తీస్తోన్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశలవారీగా మొత్తం 1,300 ఎలక్ట్రిక్ బస్సులను వినియోగంలోకి తీసుకుని రావడానికి అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు.
ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఏసీ బస్సులను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. మొదటి విడతలో 25 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 23వ తేదీ నుంచి ఇవి పూర్తిస్థాయిలో రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.

టీఎస్ఆర్టీసీ కష్టాల్లో ఉన్నా ప్రజలకు రవాణా కష్టాలు రాకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించడంలో వెనుకాడట్లేదని పువ్వాడ అజయ్ కుమార్ న్నారు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను మరింత పెంచేలా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రైవేట్ ఆపరేటర్లకు ధీటుగా టీఎస్ఆర్టీసీ పనిచేస్తోందని ప్రశంసించారు.
ఐపీఎస్ అధికారి సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించాక ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగాయని గుర్తు మంత్రి పువ్వాడ గుర్తు చేశారు. మెట్రోకు అనుసంధానంగా రవాణా సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలోనే ఒక్క కార్డుతో అన్ని రకాల ప్రయాణాలు చేసేలా ఏర్పాట్లు చేయబోతోన్నామని చెప్పారు.
భావి తరాలకు వాయు కాలుష్యం లేని వాతావరణాన్ని అందించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన అవసరం ఉందని పువ్వాడ అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించుకోవడంలో భాగంగా టీఎస్ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వంలో విలీనం చేశారని వ్యాఖ్యానించారు.
వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు మంచి డిమాండ్ ఉందని, ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరిగే బస్సుల్లో 80 శాతం ఆక్యూపెన్సీ ఉందని అన్నారు. ప్రతి రోజు దాదాపు 6,000 మంది ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారని వివరించారు. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఐటీ కారిడార్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత చేరువ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో సిటీబస్సుల సంఖ్యను పెంచబోతోన్నామని అన్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్లో 500 బస్సులు తిరుగుతున్నాయని, వచ్చే నాలుగు నెలల్లో ఈ సంఖ్యను పెంచుతామని, అదనంగా 475 ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని హామీ ఇచ్చారు సజ్జనార్.
ఈ బస్సు పొడవు 12 మీటర్లు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సులో మొబైల్ ఛార్జింగ్, సీటు బెల్ట్ సదుపాయం ఉంటుంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది.
గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేలా బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ వ్యవస్థను ఇందులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది ఈ బస్సు. ఫుల్ ఛార్జింగ్కు 2 నుంచి 3 గంటలకు సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు.












Click it and Unblock the Notifications