తెలంగాణ బంద్: ఎక్కడికక్కడ నేతల అరెస్ట్, ఎమ్మెల్యేలను నిలదీయాలన్న బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ బంద్ ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతు విపక్షాలు మద్దతు తెలిపాయి. ఆయా పార్టీల నేతలు ర్యాలీలు తీయడంతో పోలీసులు అడ్డుకొన్నారు. మరికొన్ని చోట్ల బస్సులను అడ్డుకొవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాలు మద్దతు తెలుపడంతో రహదారులపై బస్సులు కనిపించలేదు. ర్యాలీ తీస్తున్న నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొన్నారు.
లక్ష్మణ్ అరెస్ట్
అబిడ్స్ జీపీవో వద్ద బీజేపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను గోషామహల్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ సమ్మెపై చర్చలు జరిపి పరిష్కరించాలని హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. కోర్టులను కూడా లెక్కచేయకపోవడం మంచి పద్ధతి కాదన్నారు.
బంద్ విజయవంతం
ప్రభుత్వ తీరు మార్చుకోవాలని లక్ష్మణ్ హితవు పలికారు. సమ్మెకు అన్నివర్గాలు మద్దతు తెలుపడంతో బంద్ విజయవంతమైందన్నారు. ర్యాలీ తీస్తున్న నేతలను అరెస్ట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తీరును ప్రజలు ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు. ఎమ్మెల్యేలను నిలదీయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
భట్టి, శ్రీధర్ బాబు కూడా
ఇటు కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చార్మినార్ నుంచి ఆ పార్టీ నేతలు ఎంజీబీఎస్ వరకు ర్యాలీగా వెళ్తున్నారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబును అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేయడంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు చార్మినార్ వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాంగ్రెస్ నేతల అరెస్ట్ను నిరసిస్తూ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
చాడ, అజీజ్..
మరోవైపు సీపీఐ కార్యాలయంలో చాడ వెంకట్ రెడ్డి అజీజ్ పాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నారాయణగూడ పోలీసు స్టేసన్కు తరలించారు. ఇటు తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాంను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తుందని నేతలు విమర్శిస్తున్నారు. ఇది సరికాదని, వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.