ఏపీకి ఝలక్: 'టిటిడి ఆదాయంలో తెలంగాణ వాటా రూ.1,000 కోట్లు, ఇప్పించండి'
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తెలంగాణ వాటా కోసం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం నంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.1000 కోట్లు ఇప్పించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలు వాయిదా వేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏపీ, తెలంగాణ అంతర్భాగంగా ఉండేదని, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ టిటిడికి తెలంగాణకు చెందిన బోర్డు మెంబర్స్ ఉన్నందున వాటా ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో టిటిడికి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయని, పలు దేవాలయాల అభివృద్ధికి టిటిడి నిధులు సమకూరుస్తున్నందున తిరుమల వచ్చే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.
నయీం కేసులో నివేదికకు హైకోర్టు ఆదేశం
గ్యాంగ్ స్టర్ నయీం కేసు పైన మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మూడు వారాల్లోగా విచారణ నివేదిక సమర్పించడంతో పాటు, కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
నయీం కేసు పైన సిపిఐ నేత నారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సిట్ దర్యాఫ్తు ముందుకు సాగటం లేదని, సిబిఐతో విచారణ జరిపించాలని అందులో పేర్కొన్నారు. ఆ పిల్లో ప్రతివాదులుగా కేంద్ర, తెలంగాణ హోంశాఖలు, తెలంగాణ డీజీపీ, సీబీఐలను చేర్చారు. అయితే, ఇప్పటికిప్పుడు సిబిఐ విచారణకు ఆదేశించలేమని, సిట్ నివేదికతో పాటు కౌంటర్ దాఖలు చేసిన అనంతరం పరిశీలిస్తామని కోర్టు వ్యాఖ్యానించింది.