ఓడిపోతే వ్యవసాయం!: తుమ్మల కీలకవ్యాఖ్యలు, ఖమ్మంలో తెరాసకు వరుసగా షాక్లు
ఖమ్మం: ఎన్నికల ప్రచారంలో తెరాస నేత, మంత్రి (ఆపద్ధర్మ) తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను అనుకోలేదని, కానీ తమ పార్టీ అధినేత కేసీఆర్ అభీష్టం మేరకు ఎన్నికల బరిలో నిలిచానని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలనే తాను పోటీలో ఉన్నానని చెప్పారు.
గతంలో తాను తెలుగుదేశం పార్టీని వీడినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పారు. మీకు ఇష్టం లేకపోతే ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటానని ప్రజలను ఉద్దేశించి ప్రచారంలో ఆయన చెప్పారు. తద్వారా ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందా అనే చర్చ సాగుతోంది.
తుమ్మల వ్యాఖ్యల వెనుక?
తెలంగాణ రాష్ట్రంలో ఉండే పార్టీలే రాజకీయాలు చేయాలని తుమ్మల అన్నారు. పక్క రాష్ట్రం పార్టీలు ఇక్కడ ఎందుకు అని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ప్రశ్నించారు. తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి తాను పోటీ చేయాలని అనుకోలేదని, కేసీఆర్ కోరగా, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని పోటీలో నిలిచానని, మీకు ఇష్టం లేకుంటే వ్యవసాయం చేసుకుంటానని వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది.
ఓటమి భయమా, వ్యూహమా?
తుమ్మలకు ఓటమి భయం పట్టుకుందా లేక అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు అలా చేశారా లేక ప్రచార వ్యూహమా అనే చర్చ సాగుతోంది. మీకు ఇష్టం లేకుంటే వ్యవసాయం చేసుకుంటానని చెప్పడమంటే ఓడిపోతామనే అర్థమే. దీంతో ఆయనకు భయం పట్టుకుందా అనే చర్చ సాగుతోంది.
చంద్రబాబు వచ్చి వెళ్లగానే టీడీపీలోకి నేతలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాలో బుధవారం పర్యటించారు. అదే సమయంలో ఇద్దరు కీలక తెరాస నేతలు టీడీపీలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇది తెరాసకు అక్కడ మరో ఎదురు దెబ్బ. ఇద్దరు కార్పొరేటర్లు బుధవారం తెరాసకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వారు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఛైర్మన్, ఖమ్మం జిల్లా తెరాస మాజీ అధ్యక్షుడు బుడాన్ బేగ్ కూడా తెరాసను వీడి, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ నాకు మోకరిల్లాడని జానారెడ్డి
ఎన్నికల్లో నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాగార్జున సాగర్ అభ్యర్థి జానారెడ్డి కూడా బుధవారం ఆసక్తికరంగా మాట్లాడారు. తెలంగాణ ఇస్తే మీ ఇంటి ముందు కాపలా ఉంటానని, పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ అన్నాడని, తమ ఇంటికి వచ్చి తనకు మోకరిల్లాడని, అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా మర్చిపోయి పెత్తనం చెలాయిస్తున్నాడని వ్యాఖ్యానించడం గమనార్హం.
మాయమాటలతో అధికారంలోకి
కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, డబ్బులిచ్చి సభలు నిర్వహిస్తున్నారని జానారెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. పాలన చేతగాకనే తొమ్మిది నెలల ముందు అసెంబ్లీని రద్దు చేశారన్నారు. అభివృద్ధికి అంకితమైన తనను నిలదీయడం సరికాదన్నారు. ఎన్నికల్లో తమకు అవకాశమిస్తే తెలంగాణలో సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు.