Huzurabad : కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇద్దరు స్థానిక నేతలు...
హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరుపున పోటీకి ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఇందుకు గడువు ఇచ్చారు. మొదటి రోజు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకరు హుజూరాబాద్ మండలం కనుకుంట్ల గ్రామానికి చెందిన జాలి కమలాకర్రెడ్డి కాగా... మరొకరు సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఒంటెల లింగారెడ్డి. డీసీసీ ఫార్మాట్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తుల తుది గడువుకు మరో నాలుగు రోజులు ఉండటంతో ఇంకా ఎంతమంది దరఖాస్తు చేసుకుంటారో చూడాలి. నిన్న మొన్నటిదాకా పలువురి పేర్లు కాంగ్రెస్ నాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరగ్గా... ఉన్నట్టుండి అభ్యర్థి ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించడం చాలామంది ఆశ్చర్యానికి గురిచేసింది. దీన్నిబట్టి హుజురాబాద్లో కాంగ్రెస్కు అభ్యర్థి కరువయ్యారనే ప్రచారం జరుగుతోంది.
నిజానికి హుజురాబాద్ బరిలో కొండా సురేఖను దింపాలని కొంతకాలంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ కూడా అందుకు ఓకె చెప్పారని... అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్తో పాటు పరకాల,వరంగల్ తూర్పు నియోజకవర్గాల టికెట్లు కూడా తాము సూచించిన వ్యక్తులకే ఇవ్వాలని ఆమె షరతు విధించారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కొండా సురేఖ హుజురాబాద్కు నాన్ లోకల్ కావడం... టీఆర్ఎస్,బీజేపీల తరుపున లోకల్ అభ్యర్థులు బరిలో ఉండటంతో ఆ పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 6 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి ఇక్కడ 60వేల ఓట్లు పొందిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక కాంగ్రెస్ టికెట్ కోసం కౌశిక్ రెడ్డి చాలానే ప్రయత్నించారు. అయితే ఆయన మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోటరీ కావడం... టీఆర్ఎస్ కోవర్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ నాయకత్వం ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్తో టచ్లోకి వెళ్లడం... నాటకీయ పరిణామాల నడుమ ఆ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ ఆయనకు ఎమ్మెల్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హుజురాబాద్లో బీజేపీ,టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఉపఎన్నికకు ఇంకా చాలా టైమ్ ఉందని... ఇప్పుడే తొందరపాటు అక్కర్లేదని అంటోంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి సీనియర్లు మాత్రం అభ్యర్థిని త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా బీజేపీ,టీఆర్ఎస్లతో పోల్చితే హుజురాబాద్ రేసులో కాంగ్రెస్ వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.