కరోనా వైరస్ : హైదరాబాద్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్..
కరోనా వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి సోకుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏ లక్షణాలు లేనివారిలోనూ పాజిటివ్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనాపై యుద్దంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు,పోలీసులకు కూడా వైరస్ సోకుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం. తాజాగా హైదరాబాద్లో ఇద్దరు పోలీస్ సిబ్బందికి వైరస్ సోకింది. ఇందులో ఒకరు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కాగా.. మరొకరు తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్.
Recommended Video
కోవిడ్-19 వైద్య పరీక్షల్లో శనివారం వీరిద్దరికి పాజిటివ్గా తేలింది. వీరిద్దరూ గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కానిస్టేబుల్స్ కుటుంబసభ్యులను పరీక్షల నిమిత్తం అధికారులు కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పది రోజుల క్రితం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్కు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన్ను గాంధీకి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా క్వారెంటైన్లో ఉంచారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 766 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 417,నిజామాబాద్లో 58 కేసులు నమోదయ్యాయి. 18 మంది మృతి చెందారు. ప్రభుత్వం 259 కంటైన్మెంట్లను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ 20 తర్వాత సడలింపుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 19న కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలుచేయడమా.. లేక కొన్ని ప్రాంతాల్లో పాక్షిక మినహాయింపులు ఇవ్వడమా అన్నది రేపు తెలియనుంది.