మేడారం మహాజాతరలో అపశృతి : జంపన్నవాగులో ఇద్దరు భక్తుల మృతి..
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతోన్న మేడారం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జంపన్నవాగులో స్నానానికి దిగిన ఇద్దరు మూర్చ వచ్చి మృతి చెందారు. మృతులను సికింద్రాబాద్కు చెందిన వినయ్,దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్లుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమ్మక్క సారాలమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు జంపన్నవాగులో స్నానమాచరించడం ఆనవాయితీ. లక్నం చెరువు నుంచి జంపన్నవాగుకు నీళ్లు విడుదల చేయడంతో వాగు జలకళ సంతరించుకుంది. దాదాపు 24కి.మీ కాలువ ద్వారా ప్రవహించి లక్నవరం నీళ్లు జంపన్నవాగుకు చేరుతాయి.
మేడారంపై కాకతీయ సైన్యం..
కాకతీయుల పాలనలో మేడారం రాజ్యానికి చెందిన పగిడిద్దరాజు తమకు పన్ను కట్టలేదన్న కారణంతో కాకతీయ సేనలు ఆయన్ను అంతమొందించాలని కుట్ర పన్నాయి. పొలాస రాజు మేడరాజుకు ఆశ్రయం కల్పించడం.. కోయ,గిరిజనుల ఐక్యతతో తమను ధిక్కరించే సాహసం చేస్తున్నాడన్న కారణంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజును మట్టుబెట్టాలనుకున్నాడు.
Recommended Video
జంపన్నవాగు ప్రత్యేకత
పగిడిద్దరాజును మట్టుబెట్టే క్రమంలో కాకతీయ సైన్యం మేడారం పైకి దండెత్తింది. ఈ విషయం తెలిసిన మేడారం కోయ సైన్యం కాకతీయ సైన్యాన్ని సంపెంగ వాగు వద్ద అడ్డుకుంది. సమస్త ఆయుధాలతో సుశిక్షితులైన సైనికులతో ఓవైపు కాకతీయ సైన్యం.. మరోవైపు సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు,సమ్మక్క,సారలమ్మ,గోవిందరాజులు,నాగులమ్మ,జంపన్నలు. అయినప్పటికీ కాకతీయ సైన్యాన్ని చూసి వెరవక.. వారంతా వీరోచితంగా పోరాడారు. అయితే కాకతీయ సైన్యం చేతిలో తాము ఓడిపోవడాన్ని తట్టుకోలేక.. పరాజయం వార్తను భరించలేక.. జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటినుంచి ఆ వాగుకు జంపన్నవాగుగప్రసిద్ది.
నేడు గద్దెలకు పగిడిద్దరాజు..
మేడారం మహాజాతరలో భాగంగా నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరనున్నాడు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు మహబూబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి పెళ్లి కొడుకుగా ముస్తాబై మంగళవారం సాయంత్రానికి మేడారం గద్దెలకు చేరుకుంటాడు. డోలు,సప్పుళ్లు,శివసత్తుల పూనకాల నడుమ పగిడిద్దరాజును పడిగే రూపంలో కాలినడకన అక్కడికి తీసుకొస్తారు.
మహా జాతర..
మేడారం మహాజాతర-2020 ఈ నెల 8వ తేదీ వరకు జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పరిగణించే ఈ జాతరకు దాదాపు కోటి మంది భక్తులు హాజరవుతారు. గిరిజన సాంప్రదాయంలోనే ఇక్కడ పూజలు జరుగుతాయి. విగ్రహారాధన,హారతులు వంటి ఇక్కడ కనిపించవు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులు బంగారంతో తల్లులకు మొక్కు తీర్చుకుంటారు. ఇక్కడ బంగారం అంటే బెల్లం. బెల్లాన్నే సమ్మక్క సారాలమ్మలకు నైవేద్యంగా పెడుతారు. తులాభారం పేరిట కిలోల కొద్ది బంగారాన్ని తల్లుల గద్దె వద్ద సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు.