అక్కాచెల్లెళ్లు అదృశ్యం, పేకాట: 13 మంది అరెస్టు
హైదరాబాద్: ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో ఏఎస్ఐగా పని చేస్తున్న రామ్ బోవి కుమార్తెలు బిందూ రామ్ (20), రుచిత్ రామ్ (19)లు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కర్ణాటకకు చెందిన రామ్బోవి జవహర్నగర్లోని ఆర్ఏఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ, తన కుటుంబంతో కలసి హైదరాబాద్ పరిధిలోని మల్లెలగూడలో ప్రాంతంలో నివసిస్తున్నారు. శుక్రవారం నాడు రామ్ బోవి భార్య బంగారమ్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
వీరు ఎక్కడికి వెళ్లారన్న విషయంపై ఇంకా సమచారం లభించకపోవడంతో శనివారం సాయంత్రం జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్బోవి కూడా సెలవు తీసుకుని మరీ తన కూతుళ్ల కోసం వెతుకుతున్నాడు.
ఆయన పెద్ద కూతురు బిందురామ్(20) డిగ్రీ, చిన్న కూతురు రుచిత్రామ్(19) ఇంటర్ చదువుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట ఆడుతున్న 13 మంది మహిళల అరెస్టు
నగరంలో పేకాట ఆడుతున్న 13 మంది మహిళలను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ గ్రీన్హిల్స్ కాలనీలోని వైష్ణవీ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ గత కొద్ది రోజులుగా 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలు పేకాట ఆడుతున్నారు.
సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శనివారం ఫ్లాట్పై దాడి చేసి 13 మంది మహిళలను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని చైతన్య పురి పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి రూ.84 వేల నగదు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు.