విద్యార్థుల ముందే తిట్ల పురాణం: చెప్పులతో కొట్టుకున్న టీచర్లు
మెదక్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, మంచి మార్గంలో నడిపించాల్సిన గురువుల స్థానంలో ఉండి.. వారి ముందే తిట్ల పురాణం అందుకున్నారు. అక్కడితో ఆగకుండా చెప్పులతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
విద్యార్థుల, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట మండలం నార్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు వి శ్రీనివాస్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు ఎం లక్ష్మణ్ మధ్య కొద్దిరోజులుగా వివాదం నెలకొంది.
బుధవారం పాఠశాలకు వచ్చిన ఇద్దరూ కార్యాలయంలో చిన్నపాటి విషయమై గొడవకు దిగారు. ఆ తర్వాత బూతులు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా చెప్పులతో ఒకరికొకరు కొట్టుకున్నారు. విద్యార్థులు, ఇతర ఉపాధ్యాయుల ముందే ఇదంతా జరగడంతో వారంతా నిశ్చేష్టులుగా చూస్తూ ఉండిపోయారు.
చివరకు గ్రామస్థుల జోక్యంతో సమస్య సద్దుమనిగినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరు ఉపాధ్యాయులు రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. వారి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.