పా‘పాల’ బైరవులు: యూరియా, నూనెలతో పాల తయారీ, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: ఆరోగ్యానికి ఎంతో మంచివంటూ చిన్నారులుతోపాటు పెద్దలు తాగే పాలనూ కల్తీ చేస్తున్నారు ఈ దుర్మార్గులు. గేదెలు, ఆవులు లేకుండానే ఆరోగ్యానికి ఎంతో హానికరమైన యూరియా, ఇతర మిశ్రమాలతో పాలను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ దుర్మార్గుల ఆటకట్టించారు పోలీసులు.
నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారానికి చెందిన భక్త రవి(26) రెండు నెలల కిందట ఘట్కేసర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ అక్రమ దందాకు తెరలేపాడు. స్నేహితుడు రషీద్తో కలిసి కృత్రిమ పాలను తయారు చేసి లీటర్కు రూ. 40 చొప్పున ఘట్కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు పలు స్వీట్షాపులు, హోటళ్లు, టీస్టాళ్లలో విక్రయిస్తున్నాడు.
బుధవారం సైబరాబాద్ ఎస్ఓటి ఇన్స్సెక్టర్ నర్సింగ్రావు, ఎస్ఐ అంజనేయులు సిబ్బంది రవి స్థావరంపై ఆకస్మిక సోదాలు జరిపి రషీద్, రవిలను అరెస్టుచేశారు. 40కేజీల నాగార్జున యూరియా, 440 లీటర్ల కృత్రిమ పాలు, 18 ప్యాకెట్ల పాల పౌడర్, 5, సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్లు, పాల శాతాన్ని కొలిచే మిషన్, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న రవి, రషీద్ పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఈ యూరియా పాలతో ఏం అనారోగ్యం రాదంటూ బుకాయించారు. పాలలో నురుగు వచ్చేందుకు యూరియాను వాడుతామని, కొవ్వు శాతాన్ని పెంచేందుకు పల్లి నూనెను, పాలపౌడర్కు కలుపుతామన్నారు.
తమతో పాటు, చాలా మంది ఈ విధంగా పాలు తయారు చేస్తూ రోడ్లపై టీస్టాళ్లకు సరఫరా చేస్తున్నారని విచారణలో తెలిపారు. అసలు పాల ధర లీటర్కు 60 నుంచి 70 రూపాయాలు ఉంటే 40 రూపాయలకే విక్రస్తున్నామన్నారు. స్వీట్స్ షాపుల వారికి మాత్రం కృతిమ పాలతో డెయిరీ పాలను కలిపి విక్రయిస్తామని వివరించారు.
గత రెండు నెలలుగా పాలను సరఫరా చేస్తున్నాం.. ఎక్కడా ఆరోగ్య సమస్య వచ్చినట్టు సమాచారం లేదని నిందితులు పోలీసులకు వివరించడం గమనార్హం. రోడ్లపై ఉండే టీ పాయింట్ల వద్ద చాయ్ తాగేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications