కూలిన గోడ: ఇద్దరు కూలీల మృతి, కన్నీరుమున్నీరైన కుటుంబాలు
కూటి కోసం, కూలి కోసం నగరానికి వచ్చిన ఇద్దరు కూలీలు అకాల మృత్యువాత పడ్డారు. ప్రహరీ గోడ కూలి వారిద్దరు మరణించారు.
హైదరాబాద్: కూటి కోసం, కూలి కోసం నగరానికి వచ్చిన ఇద్దరు కూలీలు అకాల మృత్యువాత పడ్డారు. ప్రహరీ గోడ కూలి వారిద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిదీపట్నంలో బుధవారం ఉదయం జరిగింది.
మెహిదీపట్నం పిల్లర్ నంబర్ 28 వద్ద గోల్కొండ ప్రాంతానికి చెందిన షకీల్ అనే వ్యక్తి బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. బుధవారం మెహిదీపట్నం భోజగుట్ట వివేకానందనగర్కు చెందిన నాగేశ్(37), కృష్ణయ్య(41), శివ కుమార్(18) పనులు చేసేందుకు వచ్చారు.
కింద ఉన్న ఇనుప రాడ్లను భవనంలోకి చేరవేస్తున్నారు. ఈ క్రమంలో భవనం పక్కనే ఉన్న మరో భవనం ప్రహరీ కూలి వీరి మీద పడింది. గోడ కూలుతున్న విషయాన్ని శివ గుర్తించి అరుస్తూ మిగతా ఇద్దరినీ అప్రమత్తం చేసే లోపలే ప్రమాదం సంభవించింది.
ఇలా బయటపడ్డాడు....
తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇద్దరు కూలీలు కూడా శివను పక్కకు తోసేసారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. గోడ శిథిలాలు పైన పడడంతో నాగేశ్, కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా రోదించారు.
ఇలా జీవనం సాగిస్తూ...
కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ తాలూకా వాడ్ కోట్కు చెందిన జీ నాగేశ్ భార్య కవిత, బిడ్డలు మమత(7), నిహారిక(3), కొడుకు కార్తీక్(5)తో కలిసి మెహిదీపట్నం భోజగుట్ట వివేకానందనగర్లో నివసిస్తున్నారు. అతని ఇంటి సమీపంలోనే మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం బూర్కుంటకు చెందిన కృష్ణయ్య(41) భార్య అమృత, కొడుకు సంజు(10), బిడ్డ లక్ష్మి(7)తో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు రోజువారి కూలీలుగా పనిచేస్తూ జీవితం గడుపుతున్నారు.
ఇలా జరిగింది....
బుధవారం నాగేశ్ మామ సాయిలు మెహిదీపట్నం పిల్లర్ నంబర్ 28 వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో పని కోసం వెళ్లాలని నాగేశ్, కృష్ణయ్య, శివకుమార్ను పంపించాడు. పనికి వెళ్లిన కొద్ది సేపటికే ఘోర ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సాయిలు.. వారిని తానే పనికి పంపానంటూ రోదించడం అందరినీ కలిచి వేసింది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, రాజకీయ నాయకులు సంఘటనా స్థలా న్ని పరిశీలించారు. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి, పోస్ట్మార్టం కోసం తరలించేందుకు ప్రయత్నించగా బాధితులు, బస్తీవాసులు అడ్డుకున్నారు.
ఆందోళనకు దిగిన బాధితులు
తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను కదులనిచ్చేది లేదంటూ బాధితులు, బస్తీవాసులు ఆందోళనకు దిగారు. దీంతో ఏడు గంటలపాటు మృతదేహాలు సంఘటనా స్థలంలోనే ఉండిపోయాయి. పలుమార్లు చర్చల అనంతరం మృతుల కుటుంబాలకు రూ.6.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు బిల్డర్ పాషా అంగీకరించడంతో ఆందోళన విరమించారు.
ఇలా చెల్లించాలి....
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ప్రవేశ పెట్టిన స్కీంలో నాగేశ్, కృష్ణయ్య ఉండడంతో నిబంధనల ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల బీమా, దహన సంస్కారాల నిమిత్తం రూ.30 వేలు అందిస్తామని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
అక్రమ నిర్మాణమా...
భవనానికి జీ ప్లస్ 2 అనుమతులు మాత్రమే ఉండగా ఆరు అంతస్తులను నిర్మించారని తేలిందని, ఈ విషయమై నోటీసులు జారీ చేసినట్టు సెక్షన్ ఆఫీసర్ మహేందర్ తెలిపారు. నిర్మాణదారుపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్, టౌన్ప్లానింగ్ సిటీ చీఫ్ ప్లానర్ వసంత్రావు, ఆసిఫ్నగర్ ఏసీపీ గౌస్మొయినుద్దీన్ తెలిపారు.