కరోనా కొత్త స్ట్రెయిన్... తెలంగాణలో బయటపడ్డ తొలి కేసు... జీనోమ్ సీక్వెన్స్లో వెల్లడి...
యూకెలో వెలుగుచూసిన కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్కు సంబంధించిన కేసు తెలంగాణలోనూ బయటపడింది. డిసెంబర్ 10న యూకె నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తి(49)కి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్లుగా నిర్దారణ అయింది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఈ విషయాన్ని ప్రభుత్వానికి వెల్లడించింది. దీంతో యూకె సంబంధిత తొలి వైరస్ కేసు రాష్ట్రంలోనే నమోదైంది.ఇటీవల యూకె నుంచి తెలంగాణకు వచ్చిన 20 మందికి పాజిటివ్గా తేలగా... ఇందులో ఏడు కేసుల్లో సీసీఎంబీ అధికారులు జీనోమ్ మ్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించగా.. ఇంకా ఆ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
షాకింగ్ : భారత్లో కొత్త కరోనా N440K.. ఏపీలో 34శాతం మందికి.. మొత్తం 19 వేరియంట్స్..
ఈ నెల 22న అతనికి పాజిటివ్...
యూకె నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన ఆ వ్యక్తిలో మొదట ఈ నెల 16న కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో స్థానికంగా అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ నెల 22న పాజిటివ్గా నిర్దారణ అయింది.దీంతో అతని శాంపిళ్లను సీసీఎంబీకి పంపించగా... అక్కడ జీనోమ్ సీక్వెన్సింగ్(జన్యు విశ్లేషణ) ద్వారా అతనికి కోవిడ్ 19 కొత్త స్ట్రెయిన్ సోకినట్లు నిర్దారించారు. ఆ వెంటనే అతని కుటుంబ సభ్యులకు,అతని కాంటాక్ట్స్కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా..
అతని తల్లి(71)కి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లీ,కొడుకు ఇద్దరూ వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అతని తల్లికి సోకింది కొత్త వైరసా లేక పాత వైరసా అన్నది ఇంకా నిర్దారించాల్సి ఉంది. ఇందుకోసం ఆమె శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ నిమిత్తం సీసీఎంబీ ల్యాబ్కు పంపించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
21కి చేరిన సంఖ్య...
యూకె నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో సోమవారం(డిసెంబర్ 27) మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా బారినపడ్డ యూకె రిటర్నీస్ సంఖ్య 21కి చేరింది. ఇందులో హైదరాబాద్కు చెందిన నలుగురు,మేడ్చల్లో 9 మంది,జగిత్యాల జిల్లాలో ఇద్దరు,మంచిర్యాల,నల్గొండ,రంగారెడ్డి,సిద్దిపేట,వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. ప్రస్తుతం బాధితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
యూకె టు తెలంగాణ... మొత్తం 1216 మంది
డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ తెలంగాణకు మొత్తం 1216 మంది ప్రయాణికులు వచ్చినట్లు గుర్తించామని రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిలో ఇప్పటికే 1060 మందిని ట్రాక్ చేసినట్లు తెలిపారు. మరో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా... ఆరుగురు విదేశాలకు వెళ్లిపోయినట్లు గుర్తించామన్నారు. మిగిలిన 996 మందికి కరోనా నెగటివ్గా నిర్దారణ అయిందని తెలిపారు. పాజిటివ్గా తేలిన 21 మదిలో మరో 9 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందన్నారు.
Recommended Video