చంద్రబాబును నాతో పాటు ఉమామాధవరెడ్డి వ్యతిరేకించారు: కేసీఆర్ బాంబు! సందీప్కు హామీ
హైదరాబాద్: మాజీ మంత్రి, భువనగిరి టీడీపీ నాయకురాలు ఉమా మాధవ రెడ్డి గురువారం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు, ఆమె తనయుడు సందీప్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Recommended Video
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. దివంద మాధవ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. అలాగే సందీప్ రెడ్డికి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమయంలో ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఉమ ఓ సందర్భంలో వ్యతిరేకించారని చెప్పారు.
చంద్రబాబూ! ఇదీ పరిస్థితి, అర్థం చేసుకోండి: టీడీపీకి ఉమామాధవరెడ్డి రాజీనామా
సొంత ఆడబిడ్డ వచ్చినట్లుగా ఉంది
కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమా మాధవ రెడ్డి రాకతో సొంత ఆడబిడ్డ ఇంటికి వచ్చినట్లుగా ఉందని చెప్పారు. తనకు తోబుట్టువు లాంటిదని తెలిపారు. అలాగే మాధవ రెడ్డి తనకు ఎంతో ఆత్మీయుడన్నారు. మాధవ రెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు.
మాధవ రెడ్డి గురించి..
మాధవ రెడ్డి కేవలం భువనగిరిని మాత్రమే కాకుండా నల్గొండ జిల్లాను మొత్తాన్ని పట్టించుకునే వాడని కేసీఆర్ తెలిపారు. 1985లో తాను, మాధవ రెడ్డి ఒకేసారి ఎమ్మెల్యేలం అయ్యామని చెప్పారు. నియోజకవర్గాలకు నిధులు రాకుంటే తాను, మాధవ రెడ్డి కలిసి వెళ్లి ముఖ్యమంత్రి వద్ద కొట్లాడేవాళ్లమన్నారు.
చంద్రబాబును వ్యతిరేకించిన ఉమామాధవ రెడ్డి
ఉమా మాధవ రెడ్డి నాడు చంద్రబాబును వ్యతిరేకించారని కేసీఆర్ అన్నారు. నాడు చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు తాను, ఉమా మాధవ రెడ్డి వ్యతిరేకించామని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఈ మధ్యే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించానని, వచ్చే ఏడాది నీళ్లు రాబోతున్నాయని చెప్పారు.
ఉమ, సందీప్లకు హామీ
ఉమా మాధవ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉమకు, సందీప్కు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. యాదగిరి, భువనగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడివారైనా నరసింహస్వామిని దర్శించుకునే విధంగా చేస్తామన్నారు. ఐటీని భువనగిరి వరకు అభివృద్ధి చేస్తామన్నారు.