కొండా సురేఖ ఫిర్యాదుపై స్పందించిన పొంగులేటి..! షాకింగ్ రియాక్షన్..!
తెలంగాణ కేబినెట్లో మంత్రుల మధ్య రోజుకో పోరు జరుగుతోంది. ఇప్పటికే ఎస్సీ మంత్రుల మధ్య ఓ పోరు, అంతకంటే ముందు ఓ బీసీ మంత్రికీ, ఎస్సీ మంత్రికీ మధ్య పోరు, ఇప్పుడు ఓ మహిళా మంత్రికీ, పురుష మంత్రికీ మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర విషయంలో పొంగులేటి జోక్యంపై ఆమె ఫిర్యాదు చేసారు. దీనిపై ఆయన ఇవాళ స్పందించారు.
సమ్మక్క-సారలమ్మ జాతర విషయంలో 70 కోట్ల కాంట్రాక్టులకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోవడంపై మరో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తాజాగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వంలో మరో రచ్చకు కారణమవుతోంది. దీనిపై అధిష్టానానికి తన అభిప్రాయం చెప్తానంటూ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి ఇవాళ కొండా దంపతుల ఫిర్యాదుపై స్పందించారు.

తనపై సహచర మంత్రి అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్ది కావడం లేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ వ్యాఖ్యానించారు. అయినా తానేంటో అందరికీ తెలుసన్నారు. 70 కోట్ల కాంట్రాక్టు కోసం తాను తాపత్రయం పడాల్సిన అవసరం లేదన్నారు. తనపై ఫిర్యాదు చేయడానికి ఏముందని పొంగులేటి ఎదురు ప్రశ్నించారు. మంత్రులు సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క-సారలమ్మలాగ జాతర కోసం పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.

ఇవాళ సమ్మక్క-సారలమ్మ జాతర పనుల్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి.. ఈ జాతర కోసం 212 కోట్లు కేటాయించామని, ఇంకా నిధులు అవసరమైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అయితే గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. మేడారానికి వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు ఉండాలని, దీనిపై అందరి సూచనలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications