అభంగపట్నం కేసులో అనూహ్య మలుపు: వెలుగులోకి కొత్త కథ 'దొరల రాజ్యం'?..
హైదరాబాద్/అభంగపట్నం: అది నేరెళ్లయినా.. మంథని మధుకర్ సంఘటనైనా.. ఇప్పుడు అభంగపట్నమైనా.. ప్రతీచోటా దళితులకు భంగపాటే. న్యాయం కోసం రోడ్డెక్కి నినదించినా.. తెగించి పోరాటాలు చేస్తున్నా.. వ్యవస్థ మాత్రం వాళ్లను కమ్మేస్తూనే ఉంది.
అభంగపట్నం దళితులపై దాడి కేసు అనూహ్య మలుపు తిరగడం తిరగబడ్డ దళిత చైతన్యాన్ని ఎక్కిరించడమే. బాధితులను నటులుగా మార్చే వర్తమాన నయా కుట్ర. నిజాలను మాయం చేసినంత సులువుగా చైతన్యాన్ని మాయం చేయడం జరగదు కాబట్టి.. దీనిపై బహుజన సమాజం ఇప్పుడు గట్టిగానే దృష్టి సారించింది.
అనుకోని మలుపు:
భరత్ రెడ్డి చేతిలో దాడికి గురైన దళిత యువకులు కొండ్రా లక్ష్మణ్, బచ్చల రాజేశ్వర్.. ఆ దాడికి సంబంధించిన వీడియో వెలుగుచూసినప్పటి నుంచి అదృశ్యమయ్యారు.
భరత్ రెడ్డే వారిని కిడ్నాప్ చేసి ఉంటాడన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఇంతలో హఠాత్తుగా మీడియా ముందు ప్రత్యక్షమైన కొండ్రా లక్ష్మణ్, బచ్చల రాజేశ్వర్.. అసలు తమపై దాడి జరగలేదని, అదంతా ఓ సినిమా షూటింగ్ అని తేల్చిపారేశారు.
'దొరల రాజ్యం' సినిమా?:
దొరల రాజ్యం అనే సినిమా షూటింగ్ లో భాగంగానే తామిద్దరం అలా నటించామని, అది కేవలం నటన మాత్రమే తప్ప తమపై ఎవరూ దాడికి దిగలేదని ఆ యువకులు చెప్పారు. ఇన్నాళ్లు ఎందుకు అదృశ్యమైపోయారన్న ప్రశ్నకు.. పని నిమిత్తం హైదరాబాద్ వచ్చామని, ఇంటి వద్దే సెల్ ఫోన్స్ మరిచిపోయి వచ్చామని, అది సినిమా షూటింగ్ అని తెలియకనే తమ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారని చెప్పుకొచ్చారు. పైగా సినిమాలో నటించినందుకు తమ ఇద్దరికీ చెరో రూ.20వేలు కూడా ఇచ్చినట్లు చెప్పారు.
బాధితులా?.. నటులా?:
ఏవిధంగా చూసుకున్నా.. ఇప్పుడా ఇద్దరు యువకులు చెబుతున్న మాటలు ఎవరికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. బాధితులను నటుల్ని చేసి ఆడించే నయా కుట్రగానే దళిత, బహుజన సంఘాలు దీన్ని చూస్తున్నాయి. అదంతా వట్టి షూటింగే అయితే.. ఇన్నాళ్లు ఇంత చర్చ జరుగుతుంటే మీడియా ముందుకు ఎందుకు రాలేకపోయారు?. అదంతా నటనే అయితే భరత్ రెడ్డి ఇప్పటికీ ఎందుకు దాగుండిపోయాడు?.. ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయే పరిస్థితి.
భరత్ రెడ్డి దాడి?:
నిజామాబాద్ జిల్లా అభంగపట్నంకి చెందిన బీజేపీ మాజీ నాయకుడు భరత్రెడ్డి ఇద్దరు దళితులను మురికి కుంటలో ముంచి.. ముక్కు నేలకు రాయించాడు. మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో భరత్ రెడ్డి ఈ ఉన్మాదానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అటు జాతీయ మీడియాలోను ఈ వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దళిత బహుజన సంఘాలు అభంగపట్నంలో భారీ నిరసన చేపట్టాయి.
రౌండ్ టేబుల్ సమావేశం:
అభంగపట్నం దళితులపై దాడి కేసు అనూహ్య మలుపు తిరిగిన నేపథ్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి, బహుజన రచయిత జిలుకర శ్రీనివాస్, బహుజన ప్రతిఘటన వేదిక కన్వీనర్ ఉసా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.