రియల్టర్పై కాల్పులు: దొంగను పట్టుకోబోయి మృతి
హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్రనగర్ హైదర్గుడాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబుద్దీన్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకితో కాల్పులు జరిపారు. ఈ మేరకు షాబుద్దీన్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూవివాదాలే ఈ సంఘటనకు కారణమని అనుమానిస్తున్నారు.
మంగళవారం తెల్లవారు జామున రాజేంద్రనగర్లోని ఏజీ కాలనీలోని రహదారిపై షాబుద్దీన్ వెళ్తున్న కారుపై ఆగంతకులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. షాబుద్దీన్తో పాటు కాల్పులు జరిగిన ప్రదేశానికి వచ్చి పోలీసులు స్థానికులను విచారించారు.
దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు ఓ గూర్ఖా మరణించాడు. ఆ సఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురం సహారా ఎస్టేట్స్ రోడ్డులో ఉన్న డైమెండ్ వైన్స్ దుకాణంలో మంగళవారం తెల్లవారు జామున శబ్దం వచ్చింది.
దాంతో విధుల్లో ఉన్న బహదూర్ భండారి (55) అనే గూర్ఖా చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
దోపిడీ దొంగల బీభత్సం
నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం పొందుర్తిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్థరాత్రి రైతు రాములు ఇంట్లోకి చొరబబడిన ముసుగు దొంగలు రాములును చెట్టుకు కట్టేసి చోరీకి పాల్పడ్డారు. అతని ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, 70 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.